నేటి రాత్రి నుంచే పండుగ

1 Jun, 2014 02:21 IST|Sakshi
  • తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకలను ఏర్పాట్లు పూర్తి
  •  జిల్లా కేంద్రంలో అర్థరాత్రి 12 గంటలకు కీర్తి స్థూపం ఆవిష్కరణ
  •  ఉత్సవాలకు రాజకీయ పక్షాలు, సకల జనుల సన్నద్ధం
  •  తెలంగాణవాదుల్లో ఉత్తేజం
  • తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఓరుగల్లు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం అర్ధరాత్రి నూతన రాష్ట్రానికి స్వాగతం పలికేలా కలెక్టర్ బంగ్లా ఎదుట అమరవీరుల కీర్తి స్థూపం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఓ వైపు వేడుకల బాధ్యతలు భుజాలపై మోస్తున్న ఓరుగల్లు సేవాసమితి.. మరో వైపు అధికారిక కార్యక్రమాల నిర్వహణకు మేము సైతం అంటూ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ప్రతి తెలంగాణ బిడ్డా ఎదురుచూస్తున్న వేళ... ఉత్సవాలను పండుగలా జరుపుకునేలా... ప్రతిఒక్కరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వేడుకలకు రూపకల్పన చేసింది.  
     
    వరంగల్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: అరవై ఏళ్ల కల.. అమరుల ఆశయం.. ప్రజాకాంక్ష అరుున తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావం సాక్షాత్కరించనున్న వేళ సంబరాలు జరుపుకునేందుకు సకల జనులు సన్నద్ధమవుతున్నారు. కోటి కలలతో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, నూతన నాయకత్వంలో ముందడుగు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆది వారం రాత్రి 7 గంటల నుంచి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఓరుగల్లు సేవా సమితి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి 12.01 గంటలకు కలెక్టర్ బంగ్లా ఎదుట తెలంగాణ కీర్తి స్థూపాన్ని ఆవి ష్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. సమితి అధ్యక్షుడు, కలెక్టర్ జి.కిషన్, ఉద్యోగ జేఏసీ నాయకులతోపాటు అన్ని పక్షాలు పాల్గొననున్నారుు. ఈ కార్యక్రమానికి ముందు హన్మకొండలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులర్పించనున్నారు. పండుగను తలపించేలా కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సేవా సమితి తరఫున రెండు రోజులు, అధికారికంగా వారంపాటు ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ రూపకల్పన చేశారు. ఈ మేరకు ఎవరి పనులు వారికి అప్పగించారు.
     
    సకల జనులు సన్నద్ధం
     
    ఆదివారం అర్ధరాత్రి అమరవీరులకు నివాళులర్పించి, తెలంగాణ జెండాను ఆవిష్కరించాలని టీజేఏసీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు ఎక్కడికక్కడ కొవ్వొత్తుల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలతో ఇంటింటి సంబురం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. రెండో తేదీన టీజేఏసీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. జాతీయ జెండాతోపాటు తమతమ పార్టీల జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారుు.
     
    నగరం కాంతిమయం
     
    ఉత్సవాశోభ ఉట్టిపడేలా నగరంలోని ప్రధాన భవనాలు కలెక్టరేట్, కలెక్టర్ నివాసం, టౌన్‌హాల్, న్యాయస్థానం, ఆర్‌అండ్‌బీ భవనంతోపాటు ఇతర భవనాలకు శనివారం సాయంత్రంనుంచి విద్యుత్ దీపాలు అలంకరించారు. ‘కుడా’ అధ్వర్యంలో పార్కులు క్లీన్ చేయించడం, రంగురంగుల పతాకాల ఏర్పాట్లు, రోడ్డు మధ్యలో డివైడర్లకు రంగులు వేయడం వంటి పనులు పూర్తిచేశారు.  
     
    టీజేఏసీ భాగస్వామ్యం

    తెలంగాణ ఉత్సవాల్లో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసే ప్రణాళికతో టీజేఏసీ పనిచేస్తోంది. ఉద్యోగులు, కార్మికులు, స్వచ్ఛంద, మహిళా, విద్యార్థి, మేధావి సంఘాలతోపాటు న్యాయవాదులు, డాక్టర్లు ఇతర వర్గాల జేఏసీలన్నీ ఆవిర్భావ ఉత్సవాల్లో నూ తనోత్తేజంతో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ దిశ గా అన్ని సంఘాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. టీ జేఏ సీ పిలుపుమేరకు సోమవారం ఉద్యోగులు తమ తమ కార్యాలయాల్లో అమరవీరులకు నివాళులర్పిం చిన తర్వాతనే విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలో న్యూడెమోక్రసీ ఇతర పక్షాలు తెలంగాణ ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నాయి.
     
    గులాబీల్లో అధికార ఉత్తేజం
     
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పార్టీ శ్రేణులను పాల్గొనేలా శ్రద్ధ వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ నేతలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పిలుపునిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి జరిగే ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సోమవారం ఆవిర్భావ దినోత్సవంతోపాటు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తమ నేత కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తున్నందున ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గెలిచిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులకే బాధ్యత అప్పగించారు. ఇప్పటికే అధికారపార్టీగా మారడంతో ఆ పార్టీ దర్పం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. తాజాగా శనివారం తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, కాళోజీ, అమరవీరుల స్థూపాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టారు.
     
    కాంగ్రెస్ సైతం...
     
    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలోనే కాంగ్రెస్ జిల్లా స్థాయి పార్టీ అనుబంధ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నగర విస్తృతస్థారుు సమావేశం నిర్వహించింది. ప్రతి ఇంటా, ప్రతి గ్రామంలో ఉత్సవాల ను నిర్వహించాలని పిలుపునిచ్చింది. హన్మకొండ చౌరస్తా నుంచి అమరవీరుల స్థూపం మీదుగా కీర్తిస్థూపం వరకు ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

    ఎంజీఎం సెంటర్ లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేసి... అక్కడి నుంచి ఖిలావరంగల్ తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కాగడాల ప్రదర్శ న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సోనియా వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితిని మరోసారి జనంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నా రు. ఎన్నికల  ఓటమి నుంచి బయటపడి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇదే సరైన సమయం గా భావిస్తోంది. ఇతర రాజకీయ పక్షాలైన బీజేపీ, టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆవిర్భావ ఉత్సవాలపట్ల అంతగా స్పందన కనిపించడంలేదు.
     
    కలెక్టర్ బంగ్లా ఎదుట కీర్తి స్థూపం
     
    సుబేదారి : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా ఎదుట తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపం సగర్వంగా నిల బడింది. స్థూపాన్ని చెక్కిన శిల్పులతో పాటు మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో రాత్రి 11.27 గంటలకు ఈ స్థూపాన్ని ప్రతిష్టించారు. తొలుత కలెక్టర్ జి.కిషన్ పూజలు చేసి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాత్రి ఏడు గంట లకు ఈ పనులు ప్రారంభం కాగా... శిల్పులు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా చెమటోడ్చి స్థూపాన్ని వేదికపై నిలబెట్టారు. ఇదిలాఉండగా... స్థూపాన్ని నిలబెడుతున్నారని తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, నగర వాసులు వేల సంఖ్యలో తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను వడ్డేపల్లి రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ సందర్భంగా పలువురు స్థూపం ప్రతిష్ఠా పన పనులను కెమెరాలు, సెల్‌ఫోన్లలో బంధించారు.
     
     నేటి కార్యక్రమాలు
     రాత్రి 7 గం : కాళోజీ సెంటర్ నుంచి నిట్ వరకు కళాకారులు, వివిధ సంఘాల ర్యాలీ
         
     8 నుంచి 11.30 : కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు (కాళోజీ సెంటర్, అదాలత్, ఆర్ట్స్ కాలేజీ, కలెక్టరేట్, నిట్, పెట్రోల్ పంప్ సెంటర్ల వద్ద)
         
     11.30 నుంచి 11.50 : కాళోజీ సెంటర్, నిట్ నుంచి తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపం వరకు పోలీస్ బ్యాండ్ తో రెండు బృందాలతో కొవ్వొత్తుల ర్యాలీ
         
     రాత్రి 11.59 : తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి
         
    అర్ధరాత్రి 12..01 : కీర్తి స్థూపం ఆవిష్కరణ, ప్రతిజ్ఞ
     

మరిన్ని వార్తలు