బోధనాసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సేవలు

17 May, 2020 03:55 IST|Sakshi

వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ బోధనాస్పత్రులు, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను పునరుద్ధరించాలని వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఎలెక్టివ్‌ సర్జికల్‌ సేవలతో సహా ఆస్పత్రుల్లోని అన్ని సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్క్‌లను ఉపయోగించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సరైన భద్రత చర్యలు తీసుకుని వైద్య సేవలందించాలని కోరారు. రోగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వార్డుల్లో రద్దీ లేకుండా చూడాలని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా రోగి కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వస్తే, వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలని తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతి ఆస్పత్రులు కరోనా నోడల్‌ కేంద్రాలుగా ఉంటాయని, సరోజినీ కంటి ఆస్పత్రిలో కొంత భాగం ఐసోలేషన్‌ సెంటర్‌గా ఉంటుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు