రైలు మోత

21 Jun, 2014 04:13 IST|Sakshi
రైలు మోత
  •      భారీగా పెరిగిన చార్జీలు
  •      అన్ని తరగతులపై 14.2 శాతం పెంపు
  •      నెలకు సగటున రూ.87 లక్షల భారం
  •      జిల్లాలో నిత్యం 70 వేల మంది రాకపోకలు
  •      సామాన్యుడికి రైలు ప్రయూణమూ కష్టమే..
  • సాక్షి, హన్మకొండ: రైల్వే చార్జీలు పెంచాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రయూణికుల జేబులకు భారీగానే చిల్లు పడనుంది. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, స్లీపర్, ఏసీ కోచ్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ ప్రస్తుతం ఉన్న చార్జీలపై 14.2 శాతం పెంచుతూ రైల్వేశాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి  అమల్లోకి రానున్నారుు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లా ప్రయూణికులపై నెలకు సగటున రూ.85 లక్షల వరకు భారం పడుతుందని రైల్వేవర్గాలు అంటున్నాయి. ఇందులో సగానికి  పైగా జిల్లా కేంద్రంపైనే పడనుంది.
     
    అన్ని తరగతులపై వడ్డన
     
    గతంలో చార్జీలు పెంచినప్పుడు సామాన్యులపై భారం పడకుండాై రెల్వేశాఖ జాగ్రత్తలు తీసుకునేది. ఎక్కువగా సంపన్నులు ప్రయాణించే ఏసీ తరగతులపైనే చార్జీల వడ్డన ఉండేది. ఆ తర్వాత స్లీపర్ క్లాస్, ఎక్స్‌ప్రెస్‌ల చార్జీలను పెంచేది. అతి కొద్ది సందర్భాల్లోనే ప్యాసింజర్ రైళ్ల చార్జీలలో పెరుగుదల ఉండేది. కానీ ఈ సారి అనూహ్యంగా ప్యాసింజర్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఏసీ వరకు అన్ని తరగతులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న టికెట్ చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచింది. దానితో చార్జీల పెంపు భారం నుంచి ఏ ఒక్క ప్రయాణికుడికీ మినహాయింపు లభించ లేదు.

    జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట స్టేషన్ నుంచి 12వేల మంది, వరంగల్ నుంచి సగటున 27వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరితో పాటు పోస్టాఫీసులో, ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేసుకునే వారిని కలుపుకుంటే జిల్లా కేంద్రం నుంచి రైళ్ల ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య 40వేలుగా ఉంది. వీటితో పాటు మహబూబాబాద్, జనగామ, డోర్నకల్ వంటి ఇతర స్టేషన్లను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య సగటున దాదాపుగా 70వేలుగా ఉంది. తద్వారా ప్రతీరోజు జిల్లాలో సగటున 20 లక్షల రూపాయల వరకు టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి.

    ఈ లెక్కన చార్జీల పెంపు వల్ల ప్రతీరోజు జిల్లా ప్రయాణికులపై 2.90 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, షిర్డీ, తిరుపతి వంటి దూరప్రాంతాలకు స్లీపర్‌క్లాస్, ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారిపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ చార్జీల పెంపు వల్ల సగటున ఒక్కో ప్రయాణికుడి టిక్కెట్ ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది.

మరిన్ని వార్తలు