బడ్జెట్లో ప్రతిపాదించాలని అధికారులకు కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాదే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి కావాల్సిన నిధులను కూడా పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
పురపాలకశాఖ కార్యక్రమాలపై కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది చేపట్టనున్న ప్రాజెక్టులు, ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమాలకు అవసరమైన నిధులతో అంచనాలను రూపొందించాలని కోరారు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కేశవపురం రిజర్వాయర్పై చర్చించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైలు విభాగాలకు సంబంధించిన నిధుల అవసరాలను ఆరా తీశారు. సమీక్షలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్, అధికారులు పాల్గొన్నారు.