బాధ్యతలు స్వీకరించిన హెచ్చార్సీ చైర్మన్‌

24 Dec, 2019 06:02 IST|Sakshi

నాంపల్లి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జి.చంద్రయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్చార్సీ సభ్యులుగా రిటైర్డ్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా మహ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్, నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ విచ్చేసి కమిషన్‌ చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

2016, డిసెంబర్‌ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చివరి చైర్మన్‌గా జస్టిస్‌ సిస్సార్‌ అహ్మద్‌ కక్రూ పనిచేశారు. తదనంతరం కమిషన్‌ చైర్మన్‌ సభ్యుల నియామకం జరగలేదు. ప్రస్తుతం తెలంగాణ పేరుతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యేకంగా చైర్మన్, సభ్యులతో బెంచ్‌ ఏర్పాటైంది. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యులు మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా జస్టిస్‌ జి.చంద్రయ్య మాట్లాడుతూ... ప్రాథమిక హక్కులే మానవ హక్కులని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు