రెగ్యులర్‌ కోర్సులుగా గేమింగ్, యానిమేషన్‌!

28 Nov, 2017 01:44 IST|Sakshi

విజువల్‌ ఎఫెక్ట్స్, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కూడా..

ఉన్నత విద్యామండలి కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గేమింగ్, యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గ్రాఫిక్‌ డిజైనింగ్, ఫిలిం మేకింగ్‌ వంటి వివిధ కోర్సులపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో వాటికి డిమాండ్‌ ఉండనున్నందున, వాటిని రెగ్యులర్‌ కోర్సులుగా మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు అలాంటి  కోర్సులను రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్నా.. అనేకమంది వాటిని అభ్యసిస్తున్నా.. వ్యాలిడి టీ కలిగిన డిగ్రీలు అందజేసే యంత్రాంగం లేదు. వాటిని వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కలిగిన, నైపుణ్యాలు అందించే శిక్షణ కోర్సులుగానే నిర్వహిస్తుండటంతో వాటిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు గుర్తింపు లభించడం లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని సంస్థలే జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీకి అనుబంధంగా కొన్ని రెగ్యులర్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి.  అనేక సంస్థలు వాటిని రెగ్యులర్‌ కోర్సులుగా నిర్వహించడం లేదు.  వాటిని రెగ్యు లర్‌ డిగ్రీలు ప్రదానం చేసే కోర్సులుగా మార్పు చేయాల ని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. తద్వారా అవి వ్యాలిడిటీ కలిగిన కోర్సులుగా మారడంతోపాటు ఆయా సంస్థలకూ అనుబంధ గుర్తింపు ఇవ్వడం వల్ల పక్కాగా నిర్వహణ సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఇటీవల ఇమేజ్‌ టవర్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీటిపై మంత్రి కేటీఆర్, ఉన్నత విద్యామండలి అధికారులు చర్చించారు. మార్కెట్‌లో  డిమాండ్‌ కలిగిన ఆయా కోర్సులను రెగ్యులర్, వ్యాలిడిటీ కలిగిన కోర్సులుగా నిర్వహించాలని కేటీఆర్‌ సూచించడంతో ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన వి«ధివిధానాలపై మండలి అధికారులు సోమవారం సమావేశమై చర్చించారు.  మరో రెండుసార్లు సమావేశమై వాటిని ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

మరిన్ని వార్తలు