చర్చలు విఫలం..

16 Apr, 2020 08:27 IST|Sakshi

గాంధీలో కొనసాగుతున్న ‘నర్సింగ్‌’ సమ్మె

నేడు వైద్యమంత్రిని కలవనున్నఅవుట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులు

గాంధీఆస్పత్రి: గాంధీఆస్పత్రిలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్‌నర్సులు బుధవారం వైద్యాధికారులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెకొనసాగుతుందని, గురువారం వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిపరిస్థితిని వివరిస్తామని అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సుల యూనియన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో  212 మందిస్టాఫ్‌నర్సులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ప్రకటించడంతోవారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోరెగ్యులరైజ్‌ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ బుధవారం బహిష్కరించారు.  ఈ మేరకు యూనియన్‌ ప్రతినిధులు మేఘమాల, లక్ష్మీ, ఇందిర, ప్రమీలలు డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌తో మాట్లాడారు. ఇటువంటి తరుణంలో విధులు బహిష్కరించడం తగదని, రెగ్యులరైజ్, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తమ చేతుల్లోలేదని, ప్రభుత్వం నిర్ణయిస్తుందని అధికారులు స్పష్టం చేయడంతో యూనియన్‌ ప్రతినిధులు బయటకు వచ్చి చర్చలు విఫలం అయినట్లు ప్రకటించారు. విధులకు హాజరుకాకుంటే టెర్మినేట్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మూడు షిఫ్ట్‌ల్లో 150 మంది రెగ్యులర్‌ నర్సింగ్‌ సిబ్బంది
గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 200మంది అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు విధులు బహిష్కరించడంతో రెగ్యులర్‌ సిబ్బంది 150 మంది మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. బుధవారం 18 మంది అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులు విధులకు హాజరయ్యారని, మిగిలిన వారంతా బహిష్కరించారని వివరించారు. కోవిడ్‌ బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామన్నారు.

మరిన్ని వార్తలు