గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

3 Oct, 2019 04:09 IST|Sakshi

ఆయన పేరు పెట్టుకున్నవారే ఆశయాలను గాలికి వదిలేశారు: లక్ష్మణ్‌  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కొంతమంది గాంధీ పేరు పెట్టుకొని.. ఆయన ఆశయాలను గాలికి వదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. గాంధీ పేరు తగిలించున్నంత మాత్రాన వారంతా ఆయన వారసులు కాలేరని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలను తాము ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి లక్ష్మణ్, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బుధవారం నుంచి జనవరి 30 వరకు గాంధీజీ 150వ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఎంపీలు గాంధీ సంకల్ప్‌యాత్ర చేపట్టారని తెలిపారు.

మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలోనూ ఒక కమిటీ ఏర్పాటు చేసి జయంతి వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. మోదీని జాతిపిత అని ట్రంప్‌ చేసిన వాఖ్యలపై కొంతమంది రాద్దాంతం, రాజకీయం చేసే ప్రయత్నం చేశారన్నారు. మోదీ ఒక తండ్రిలా వ్యవహరిస్తున్నారని, ఆ ఉద్దేశంతోనే మోదీని ట్రంప్‌ దేశానికి తండ్రిలాంటి వారు అని అన్నారన్నారు. గాం«దీజీ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారని, మోదీ కూడా పరిశుభ్రతకు పెద్దపీట వేశారన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు సుధా పద్మినీ చారిటబుల్‌ ఫౌండేషన్‌ గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది.  

మరిన్ని వార్తలు