బంజారాహిల్స్(హైదరాబాద్): చిన్న పిల్లని చూడకుండా వారం రోజుల పాటు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక విషయం భయటపెట్టడంతో ఈ సంఘలన వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని సయ్యద్నగర్లో నివసించే బాలిక(10) ఎన్బీటీనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది.
బాలిక సోదరి ఎన్బీటీ నగర్లోనే పదో తరగతి పరీక్షలు రాస్తుండగా ప్రతిరోజూ అక్కకి తోడుగా స్కూల్కు వస్తూ అక్కడే కూర్చుంటోంది. ఇదే అదునుగా ఇద్దరు యువకులు ఈ బాలికపై కన్నేశారు. వారం క్రితం మాయ మాటలు చెప్పి వ్యాన్లో ఎక్కించుకొని సయ్యద్నగర్లోని ఓ షెట్టర్లోకి తీసుకెళ్లి మత్తు మందు చల్లి అత్యాచారం చేశారు. ఆ మరుసటి రోజు కూడా అదే రీతిలో వ్యాన్లో ఎక్కించుకొని ఎన్బీటీనగర్లోనే ఓ గదిలోకి తీసుకెళ్లారు. ఇలా ప్రతిరోజూ బాలికను భయపెట్టి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో బాలిక భయపడి ఈ విషయం దాచింది. అయితే, శుక్రవారం ఉదయం బాలిక తీవ్ర నొప్పితో విలవిల్లాడుతుండటంతో తల్లి గమనించింది. ఆరా తీయగా బాలిక విషయమంతా చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిరోజూ తనలాగే మరోబాలికను కూడా తీసుకొచ్చేవారని బాధిత బాలిక పేర్కొంది. ఇద్దరు యువకులు 22 సంవత్సరాల వయసు ఉంటారని వారిని చూస్తే గుర్తు పడతానని బాధితురాలు అంటోంది. పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 376, 511 కింద కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు.