కరీంనగర్: ‘చంద్రబాబు రింగు మాస్టర్ అయితే.. రేవంత్రెడ్డి పేయిడ్ వర్కర్’ అని కరీంగనర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆయన బుధవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ.... చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు.
ఇష్టారాజ్యంగా మాట్లాడితే గుణపాఠం తప్పదని ఆయన రేవంత్ను హెచ్చరించారు. రేవంత్రెడ్డి చేసే భూదందాలు, అక్రమ లావాదేవీలతో పాటు అరచకాలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడుతామన్నారు. చంద్రబాబును కరెంటు అడగాలని టీడీపీ నేతలు చెప్పడం వారి అవివేకానికి నిదర్శమన్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకు కేటాయించిన రూ.75 వేల కోట్లు ఎస్బీహెచ్ నుంచి రాకుండా అడ్డుకట్ట వేసింది చంద్రబాబేనని ఆరోపించారు. డబ్బులు రాకుండా కుట్రలు పన్నిన చంద్రబాబు అడగగానే కరెంటు ఇస్తారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.