కేటీఆర్‌కు పోన్నం బహిరంగ లేఖ

20 Jul, 2020 18:29 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలో రేపు(మంగళవారం) ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమాలాకర్‌ కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. అనంతరం గంగుల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా కరీంనగర్‌లో రేపటి నుంచి నిరంతరాయంగా వాటర్‌ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఐటీ టవర్‌ రేపటి నుంచి వినియోగంలో వస్తుందని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా వాటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ను మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి పనులు అక్టోబర్ 2 వరకు పూర్తి చేస్తామని చెప్పారు. దసరా నుంచి కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభిస్తామని, మానేరు రివర్ ఫ్రంట్ పనులు త్వరలో చేపడతామన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ పర్యాటక కేంద్రంగా మారబోతుందని మంత్రి గంగుల తెలిపారు. (చదవండి: గంగులపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు)

కేటీఆర్‌కు పోన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ...
మంత్రి జిల్లా పర్యాటన సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్‌లో మంచి నీటి సరఫరాను ప్రారంభించనున్న కేటీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచినీటికి ఎంత ఖర్చు చేశారో కాంగ్రెస్ హయాంలో ఎంత ఖర్చు చేసిందో ఈ సందర్భంగా స్పష్టం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఐటీ టవర్‌లో ఎన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎంతమందికి ఉద్యోగం ఇస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. కేబుల్ బ్రిడ్జినీ పరిశీలించే మంత్రి కేటీఆర్ దాని పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి నగర ప్రజలు పొల్యూషన్ బారిన పడకుండా చూడాలన్నారు. గతంలో కరీంనగర్‌కు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో స్పష్టం చేయాలని పోన్నం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు