చంద్రబాబు.. ‘బ్రీఫ్డ్‌ ఇంగ్లీష్‌ ముఖ్యమంత్రి’

9 Jul, 2017 19:36 IST|Sakshi
చంద్రబాబు.. ‘బ్రీఫ్డ్‌ ఇంగ్లీష్‌ ముఖ్యమంత్రి’

♦ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం

గుంటూరు జిల్లా: చంద్రబాబు మొహం చూడకుండా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సంతోష పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో చివరి రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు నాకు ఏసీబీ ఉంది.. నీకు ఏసీబీ ఉందని మాట్లాడాడని, నీ ఏసీబీ ఎక్కడుందని గట్టు ప్రశ్నించారు. సిగ్గు, శరం విడిచి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని మండిపడ్డారు. బ్రీఫ్డ్‌ ఇంగ్లీష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపే శక్తి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తరువాత ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. మూడేళ్లల్లో రూ. 3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో స్వాతంత్రం రావాలని, మన రక్తపు బొట్టు ధారపోసైనా వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని, రాష్ట్రం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ సీపీ ఉంటుందన్నారు. తెలంగాణకు అంతక ముందు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైఎస్సార్‌ అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో 34 పైగాప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నారన్నారు. నీరు లేక పంటలు రాక ఇబ్బందులు పడుతు ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతాంగా సంక్షేమం కోసం ఉచిత కరెంట్‌ ఇచ్చారన్నారు. దీంతో రైతుల జీవితాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు.

వైఎస్సార్‌ పథకాలకే కేసీఆర్‌ పేరు మార్చారు..
భారతదేశం మొత్తంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్సార్‌ సిద్ధాంతాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు సాగటం ప్రారంభించాయని గుర్తు చేశారు. అందరికి ఉపయోగపడే వైఎస్సార్‌ ప్రజా సంక్షేమ పథకాలు పూర్తిగా తెలంగాణలో అమలు కావటంలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగా తెచ్చిన పథకాలు ఏమిలేవని చెప్పారు. వైఎస్సార్‌ పథకాలకే పేరు మార్చి కొన్నింటి అమలు చేస్తున్నారన్నారు. ఏపీ రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న రాక్షస, నీచ, దుష్ట, అనినీతి నయవంచన పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉపకార వేతనాల బకాయిలు పెరుకపోయి ఉన్నాయని వాపోయారు. అణగారిన వర్గాల సంక్షేమం తెలంగాణలో అణగారి పోయిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో గిరిజన ప్రజల కోసం వైఎస్సార్‌ 2.5 లక్షల ఎకరాలు అటవీ హక్కుల చట్టం క్రింద గిరిజనులకు భూములు పంపిణీ చేశారని, కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని గిరిజనుల నుంచి లాగేసుకొంటుందని చెప్పారు. చివరల్లో జోహర్‌ వైఎస్సార్‌, జగనన్న నాయకత్వం వర్థిల్లాలి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు