బల్దియాకు బహుమానం

29 Jul, 2018 04:52 IST|Sakshi
ప్రధాని మోదీ నుంచి బహుమతి అందుకుంటున్న మేయర్‌ రామ్మోహన్, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి. చిత్రంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

రూ.26 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేసిన కేంద్రం

బాండ్ల జారీతో నిధులు సేకరించినందుకు పురస్కారం

మేయర్‌ రామ్మోహన్, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిలకు బహుమతి అందజేసిన ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్‌ బొంతు రామ్మోహన్, కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ అర్బన్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్‌ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్‌.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్‌ సింగ్, హరిదీప్‌సింగ్, గవర్నర్‌ రాంలాల్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ
హైదరాబాద్‌లోని సింగం చెరువు తండా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది.  

సూచన పాటించారు.. బహుమతి పొందారు
స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్‌ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్‌ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్‌డీపీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు.

పుణే తర్వాత జీహెచ్‌ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్‌ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్‌డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్‌ కోరారు. ఈ  మేరకు సీఎస్‌ ఎస్‌కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్‌ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది.  

ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు...
జీహెచ్‌ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్‌ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు