భారీ వర్షాలు, జీహెచ్‌ఎంసీ చర్యలు

27 Sep, 2019 08:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో శుక్రవారం అర్థరాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతొ జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్ర‌స్తుతం కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 384 ప్ర‌త్యేక బృందాల‌ను జీహెచ్‌ఎంసీ రంగంలోకి దించింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో  ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

బుద్ద భవన్ దగ్గర ఇ.వి.డి.ఎం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి తెల్లవారుజామున నాలుగు గంటలకు నీట మునిగిన ప్రాంతాలకు చేరుకొని సహాయక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షానికి రోడ్లపై కూలిన చెట్లను ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలతో కలిసి స్వయంగా తొలిగించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో నియమించారు.

  • అత్యవసర పరిస్థుతుల్లో డయల్ 100, జిహెచ్ఎంసి కాల్ సెంటర్ 040-21111111 లకు ఫోన్ చేయాలని బల్దియా విజ్జప్తి చేసింది.
  • భారీ వర్షాల నేపథ్యంలో కమిషనర్ లోకేష్ కుమార్  జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించి మొత్తం 252 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 132 స్టాటిక్ బృందాలు ఉన్నాయి. మొత్తం 252 మొబైల్ బృందాల‌లో ఇన్‌స్టాంట్‌ రిపేర్ టీమ్‌లు 79, మినీ మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు 120, మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు 38, సెంట్ర‌ల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు 15 ఏర్పాటు చేశారు.
  •  టాటాఏస్‌, ఓమ్నీ వ్యాన్‌, న‌లుగురు లేబ‌ర్లు ,ట్రీ క‌ట్ట‌ర్‌, పంప్‌, గొడ్డ‌ళ్లు, క్రోబార్స్ తో 120 మినీ మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు సిద్దంగా ఉన్నాయి.
  • మొబైల్ మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు(38): ప్ర‌తి ఇంజ‌నీరింగ్ డివిజ‌న్‌కు ఒక మొబైల్ మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాన్ని కేటాయించారు. దీనిలో డి.సి.ఎం వ్యాన్‌లో ఐదుగురు లేబ‌ర్లు, ఒక జ‌న‌రేట‌ర్‌, నీటిని తొల‌గించే పంపులు, చెట్ల‌ను క‌ట్‌చేసే మిష‌న్లు ఇతర ప‌రిక‌రాల‌తో సిద్దంగా ఉంటారు.
  • సెంట్ర‌ల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు (15) : సెంట్ర‌ల్ కంట్రోల్ రూంలో 15 ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను అందుబాటులో ఉంచారు. ప్ర‌తి బృందంలో డి.సి.ఎం వ్యాన్‌, ఐదుగురు లేబ‌ర్లు, ఒక జ‌న‌రేట‌ర్‌, నీటిని తొల‌గించే పంపులు, చెట్ల‌ను క‌ట్‌చేసే మిష‌న్లు ఇతర ప‌రిక‌రాల‌తో సిద్దంగా ఉంటారు.
  • న‌గ‌రంలోని అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో 132 ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను నియ‌మించారు. న‌లుగురు కార్మికులతో కూడిన ఒక్కో బృందం నాలాల్లో నీటి ప్ర‌వాహాన్ని నిలువ‌రించే ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను తొల‌గించే పనిని చేపడతారు.
  • నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించ‌డానికి 255 పంపుల‌ను సిద్దంగా ఉంచారు.
మరిన్ని వార్తలు