విజయ్‌ బ్రాండ్‌

10 Aug, 2019 09:24 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నీటి సంరక్షణ, ‘స్వచ్ఛ’ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు సినీ హీరో విజయ్‌ దేవరకొండ జీహెచ్‌ఎంసీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. ఇందుకు ఆయన ముందుకొచ్చారని పేర్కొన్నారు. ‘సాఫ్‌ హైదరాబాద్‌–షాన్‌దార్‌ హైదరాబాద్‌’, వాక్‌ (వాటర్‌ లీడర్‌షిప్‌ అండ్‌ కన్జర్వేషన్‌ అలయెన్స్‌)ల నిర్వహణపై శుక్రవారం జలమండలి కార్యాలయంలో యూసీడీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సాఫ్‌ హైదరాబాద్‌–షాన్‌దార్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని నగరవ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు 4,700లకు పైగా మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందన్నారు. గ్రేటర్‌లో ప్రతిరోజు 16కోట్ల లీటర్ల నీరు వృథాగా పోతోందన్నారు. అడిషనల్‌ కమిషనర్లు శ్రుతి ఓజా, సిక్తా పట్నాయక్, జలమండలి ఈడీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు