ఈ సారి బాలికలదే హవా

3 May, 2014 23:36 IST|Sakshi

 సాక్షి, సంగారెడ్డి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో  మెతుకుసీమ రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. సాధారణ విభాగంలో 49 శాతం ఉత్తీర్ణతతో  ఆదిలాబాద్ జిల్లాతో కలిసి 23వ స్థానాన్ని పంచుకుంది. గతేడాది ఫలితాల్లో 46 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిన మెదక్ జ్లిలా...ఈ ఏడాది ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగినా, జిల్లా మాత్రం అట్టడుగు స్థానానికి దిగజారింది. జిల్లా నుంచి 27,228 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కాగా 13,362 మంది ఉత్తీర్ణులయ్యా రు. ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. 14,220 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, కేవలం 6,326 మంది మాత్రమే విజయం సాధించడంతో ఉత్తీర్ణత శాతం 44 మాత్రమే  నమోదైంది. పరీక్షలకు హాజరైన 13,008 మంది బాలికల్లో 7,036 మంది విజయం సాధించారు. దీంతో బాలికల ఉత్తీర్ణత శాతం 54గా నమోదైంది.

 ఒకేషనల్ కోర్సుల్లో..
 వృత్తి విద్యా విభాగం ద్వితీయ ఫలితాల్లో జిల్లా 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. మొత్తం 2,960 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 1,660 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,957 మంది బాలురుల్లో 990 మంది పాస్‌కాగా, ఉత్తీర్ణతా శాతం 51గా నమోదైంది. 1,003 మంది బాలికల్లో 670 మంది ఉత్తీర్ణలు కాగా, 67 శాతం న మోదైంది.

 ప్రభుత్వ కళాశాలలే భేష్..
 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు మళ్లీ సత్తా చాటాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలు 69 ఉత్తీర్ణత సాధించి తెలంగాణలోనే రెండో స్థానంలో నిలవడం ఒక్కటే ఈ ఫలితాల్లో ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు