ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగించండి!

7 May, 2018 01:13 IST|Sakshi

గవర్నర్‌కు ప్రతిపాదించేందుకు సిద్ధమవుతున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ భవనాలను అప్పగించాలని గవర్నర్‌ నరసింహన్‌ను కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీ పోలీస్‌కు కేటాయించిన భవనాల కోసం తెలంగాణ పోలీస్‌ అధికారులు, కార్పొరేషన్ల భవనాల కోసం వివిధ రకాల కార్పొరేషన్లు ప్రతిపాదనలు పంపేందుకు రెడీ అవుతున్నారు.

రాష్ట్ర విభజనలో భాగంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలను ఏపీ, తెలంగాణకు పంచడం.. ఆ తరువాత ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివెళ్లడంతో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. సరైన నిర్వహణ లేక పాడుబడే స్థితికి వస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన భవనాలు సరైన విధంగా లేకపోవడం, ఇరుకైన గదుల్లో నెట్టుకొస్తుండటంతో ఖాళీ భవనాలను వినియోగించుకోడానికి గాను గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు