-

భరోసా ఇవ్వండి

16 Feb, 2015 02:28 IST|Sakshi

సిరిసిల్ల : వస్త్రోత్పత్తి కార్మికులు రేరుుంబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుంటూ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర కూలితో దిక్కుతోచక శాశ్వత ఉపాధి మార్గాల కోసం దిక్కులు చూస్తున్నారు. మరోవైపు సిరిసిల్లలో ఏ కార్ఖానాలో ఎంతమంది పనిచేస్తున్నారో... ఎంత వస్త్రం ఉత్పత్తవుతుందో... ఎవరివద్దా లెక్కల్లేవు. భవిష్యత్‌పై భరోసా కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జౌళిశాఖ అధికారులు, సిరిసిల్ల ప్రతినిధులతో సోమవారం ఉన్నతస్థారుు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
 
 కార్మికుల డిమాండ్లు
 వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు నమ్మకమైన ఉపాధికి భరోసా కావాలి. కార్మికులు పనిచేసే కార్ఖానాలో గుర్తింపు కార్డు విధిగా ఇవ్వాలి. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీ కార్మికునికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. కార్మికుడి ఆదాయంలో ఎనిమిది శాతం మేర పొదుపు చేయాలి.
 
 ఒక్కో కార్మికుడు నెలకు రూ.6 వేలు ఆ దాయం పొందితే అందులో ఎనిమిది శాతం అంటే రూ.500 మినహాయించి పీఎఫ్ ఖాతా కు జమ చేయాలి. అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేస్తుంది. అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున కార్మికుడి కి జమ అవుతుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున కార్మికునికి భవిష్య నిధి జమ అవుతుంది. ఐదారేళ్లలో పెద్దమొత్తంలో రూ.60 వేల నుంచి రూ.80 వేల వర కు కార్మికునికి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
 
  ఇలా పొదుపు చేసిన డబ్బు కార్మికుడి అవసరాల కు ఉపయోగపడుతుంది. గుర్తింపు కార్డు మూలంగా ప్రమాద బీమా, హెల్త్‌కార్డ్స్ వంటివి జారీ చేయడంతోపాటు కార్మికుడి భార్య, కూతురు ప్రసూతికి ఆర్థికసాయం అందుతాయి. మరోవైపు ఏటా బోనస్ ల భించేలా ఏర్పాటు చేయాలి. అసంఘటిత రంగంగా ఉన్న వస్త్ర కార్మికులను ఆసాముల యజమానులతో కలిపి సంఘటిత రంగంగా మార్చాలి. వేజ్‌బోర్డు, వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రభుత్వ అజమాయిషీలో వేతన ఒప్పందాలు జరగాలి.
 
 సిరిసిల్ల వస్త్రానికి గుర్తింపు రావాలి
 సిరిసిల్లలో తయారువుతున్న అన్ని రకాల వస్త్రాలను ముతక రకంగానే మార్కెట్‌కు తరలిస్తున్నారు. 34 వేల మరమగ్గాలున్న సిరిసిల్లలో 25 వేల మంది కార్మికులు పని చేస్తున్నా అధికారికంగా ఎక్కడా ఆ వివరా లు రికార్డు కాలేదు. ఉత్పత్తవుతున్న వస్త్రం వివరాలు ఎక్కడా నమోదు కావడం లేదు. టెక్స్‌టైల్ పార్క్ సహా ఏ కార్ఖానాలోనూ ఇంతమొత్తంలో వస్త్రం ఉత్ప త్తి చేస్తున్నామని రికార్డుల్లో రాయడం లేదు. ఎంతమేర జీతాలుగా చెల్లిస్తున్నారో నమోదు చేయడం లేదు.
 
 చట్టబద్ధంగా ఎగుమతులు, వచ్చే ఆదాయం, జరుగుతున్న ఖర్చుల వివరాలు రికార్డు చేయాల్సి ఉండగా, సిరిసిల్లలో అలా జరగడం లేదు. ఫలితంగా సిరిసిల్ల వస్త్రానికి గిట్టుబాటు లభించడం లేదు. సిరిసిల్లలోనే ప్రాసెసింగ్, డైయింగ్, ప్రింటింగ్ చేసి రెడీమేడ్ వస్త్రాల తయారీ, గార్మెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఫలితంగా ఇక్కడి వస్త్రానికి ఇక్కడే పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం మూలంగా మధ్యవర్తులు మిగుల్చుకునే కమీషన్ లేకుండా నేరుగా అమ్ముకునే వీలుంటుంది. ఎంబ్రారుుడరీ వంటి నైపుణ్య పనులతో పూర్తిస్థాయిలో సిరిసిల్ల వస్త్రానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇక్కడే మార్కెట్ చేయడం మూలంగా వస్త్రాన్ని డిమాండ్‌గా అమ్మవచ్చు. ఫలితంగా కార్మికులకు సంతృప్తికరమైన వేతనాలు అందించే అవకాశం ఉంది. ఆకలి చావుల సిరిసిల్లలో కార్మికులకు మెరుగైన వేతనాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.
 
 హైదరాబాద్‌లో నేడు మంత్రి సమీక్ష
 రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కె.తారకరామారావు సోమవారం హైదరాబాద్ బేగంపేట హరిత హోటల్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జౌళి శాఖ ఉన్నతాధికారులతో పాటు వస్త్ర పరిశ్రమ ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొంటున్నారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సిరిసిల్ల నేతన్నలకు ప్రయోజనం కలిగేలా స్వార్థంవీడి వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వానికి నివేదికలిస్తే నేత సమాజానికి అట్టడుగులో ఉన్న కార్మిక వర్గానికి మేలు జరుగుతుంది.
 
 గతంలో లాగా సమస్య ఒకటైతే మరో అంశంపై చర్చించి మెజారిటీ వర్గానికి మేలు చేయకుండా కొద్దిమందికే లాభం జరిగేలా చర్చిస్తే సిరిసిల్ల సమస్యలకు ముగింపు ఉండదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 217 మందికి నేత కార్మికుల ఆత్మహత్యలుగా గుర్తించి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం అందించారు.
 
 ఇంతకు మరో రెండింతలు వివిధ కారణాలతో నేతన్నలకు పరిహారం దక్కకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ వాస్తవాలను ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు కార్మిక వర్గానికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే నేతన్నలకు దీర్ఘకాలిక ప్రయోజనం దరిచేరుతుంది.
 

మరిన్ని వార్తలు