బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించండి

27 Dec, 2017 00:57 IST|Sakshi

 రాష్ట్రపతిని కలిసిన ఆర్‌.కృష్ణయ్య బృందం

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మంగళవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ బృందం వినతి పత్రం సమర్పించింది. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపింది. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆర్టికల్‌ 340 ప్రకారం చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరింది.

వినతి పత్రంలోని అంశాలు..
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. పంచాయతీరాజ్‌ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్‌ను తొలగించాలి. బీసీల జనాభా ప్రకారం కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలి.

బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ/ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని సాచురేషన్‌ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. కేంద్ర స్థాయిలో రూ.60 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయాలి.

జాతీయ బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్‌ కింద ఏటా రూ.50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదు. మెరిట్‌లో వచ్చిన వారిని ఓపెన్‌ కంపిటీషన్‌లో భర్తీ చేయాలి. ఈ సమావేశంలో నందగోపాల్, భూపేష్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు