గుట్టుగా గ్లైసిల్‌..

28 Apr, 2019 10:32 IST|Sakshi
నిషేధిత గ్లైఫోసెట్‌ గడ్డి మందును పట్టుకున్న పోలీసులు (ఫైల్‌)

గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా గ్లైసిల్, గ్లైఫోసెట్‌ అమ్మకాలు

కలుపు సమస్య, గులాబీ పురుగు నివారణ తట్టుకుంటుందని ప్రచారం

రైతులకు అంటగడుతున్న వ్యాపారులు

సీజన్‌కు ముందే నిల్వలు

గతేడాది ఉమ్మడి జిల్లాలో 34 కేసులు

ఏటా రూ.కోట్లలో నకిలీల దందా.. 

ఈసారి కొరవడిన నిఘా

పెంచికల్‌పేట(సిర్పూర్‌): నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్‌ అమ్మకాలు మళ్లీ గ్రామాల్లో జోరందుకుంటున్నాయి. వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. పత్తిలో కలుపు సమస్య ఉండదని, గులాబీ పురుగు నివారణకు మెరుగ్గా పనిచేస్తుందని నమ్మబలికి రైతులకు అంటగడుతున్నారు. రబీ సీజన్‌ ఇంకా పూర్తి కాకముందే వచ్చే ఖరీఫ్‌ కోసం నకిలీ విత్తనం గ్రామాల్లోకి చేరుతోంది. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా దందా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్‌ దుకాణాల ముసుగులోనూ ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరి నుంచి జూన్‌ వరకు(గత ఖరీఫ్‌ సీజన్‌) ఉమ్మడి జిల్లాలో 34 చోట్ల రూ.2 కోట్ల వరకు విలువ చేసే నకిలీ విత్తనం పట్టుబడడం దందా తీవ్రతకు అద్దం పడుతోంది. 

పత్తి సాగుకే మొగ్గు.. 
ఉమ్మడి జిల్లాలో రైతులు ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా సుమారు 9వేల నుంచి 10వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు అంచనా. కాగా పత్తి సాగులో కొన్నేళ్లుగా రైతులు బీటీ– 2, బీటీ– 3 విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు. చీడపీడల వ్యాప్తి తట్టుకుంటుందని, కలుపు నివారణకు కూలీల సమస్య ఉండదని రైతులు వీటి వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కలుపు నివారణ మందులు తట్టుకునే గ్లైసిల్, తదితర పేర్లతో గుర్తింపు లేని విత్తనాలు తయారు చేసి రైతులకు కట్టబెడుతున్నారు. వీటి ద్వారా పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో పాటు భూసారం దెబ్బతినడం, రైతులు అనారోగ్యం బారిన పడే అవకాశముందని ప్రభుత్వం నిషేధించింది. కాని ఏటేటా సీజన్‌కు ముందే ఈ దందా మూడు పూలు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోంది. 

కుమురం భీం జిల్లాలో అధికం..
నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్‌ అమ్మకాలు ఉమ్మడి జిల్లా పరిధిలోని కుమురం భీం జిల్లాలో అధికంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో 3,12,796 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, పెంచికల్‌పేట్, సిర్పూర్‌(టి), (యూ), రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి, మండలాల్లో పత్తి సాగు అధికంగా ఉంటుంది. జిల్లాలో 2016– 17 ఏడాది ఖరీఫ్‌లో 1,86,332 ఎకరాల్లో, 2017– 18లో రికార్డు స్థాయిలో 2,38,096 ఎకరాల్లో, 2018– 19 ఏడాదిలో 2,30,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. మద్దతు ధర ఒకానొక సందర్భంగా రూ.5500లు పలకగా ఈసారి మరింత పెరిగే అవకాశముందని రైతులు భావిస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకుని వ్యాపారులు ఈ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. గ్లైసిల్‌ విత్తనాలు కిలోకు సుమారు రూ.2000ల నుంచి రూ.2200ల వరకూ విక్రయిస్తున్నారు. మరోవైపు ఇక్కడ బెజ్జూర్‌ మండలంలోని గబ్బాయి గ్రామంలో ఇటీవల క్వింటాల్‌ గ్లైసిల్‌ విత్తనాలను పట్టుకున్నారు. పాపన్‌పేట్‌లో 20 కిలోలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. 

మహారాష్ట్ర, ఆంధ్రా నుంచి.. 
నకిలీ విత్తనాలను వ్యాపారులు మహారాష్ట్ర, ఆంధ్రా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గ్రామాల్లోని బడా రైతులు, వ్యాపారులతో చేతులు కలిపి సులువుగా విక్రయాలు చేపడుతున్నారు. ప్యాకెట్లు, విడిగా కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాలు సాగుచేస్తే కలిగే దుష్పలితాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాధికారులు ఖరీఫ్‌ సీజన్‌కు ముందు ఎలాంటి సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో రైతులు సైతం అధిక దిగుబడి ఆశతో గ్లైసిల్‌ మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధి సరిహద్దు ప్రాణహిత నది అవతలి వైపు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా గ్లైసిల్, గ్లైఫోసెట్‌ దిగుమతి జరుగుతున్నట్లు తెలుస్తోంది.   

విక్రయిస్తే చర్యలు తప్పవు
ప్రభుత్వం గ్లైసిల్‌ విత్తనాలను, గ్లైఫోసెట్‌ మందులను నిషేధించింది. పోలీసు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నాం. అమాయక రైతులకు నిషేధిత విత్తనాలను అంటగడుతున్న వారిపైన కేసులు నమోదు చేస్తాం. రైతులు నిషేధిత విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. విత్తనాలు  కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా రశీదులు తీసుకోవాలి. నిషేధిత విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలి. – రాజులనాయుడు, ఇన్‌చార్జి ఏడీఏ పెంచికల్‌పేట్‌ 

కేసులు నమోదు చేస్తున్నా..
గ్లైసిల్, గ్లైఫోసెట్‌ విక్రయాలపై నిత్యం కేసులు నమోదవుతున్నాయి. అయినా ఈ దందా మాత్రం ఆగడం లేదు. పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో గత సీజన్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 కేసులు నమోదు చేశారు. ఇటీవల సైతం పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గతంలో మే, జూన్‌లో నకిలీ విత్తనాలు గ్రామాలకు చేరేవి. కాని గతేడాది నుంచి వ్యాపారులు ముందుగానే డపింగ్‌ చేస్తున్నారు. ఖరీఫ్‌ ఆరంభంలో సరఫరాకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయని, పోలీసు, వ్యవసాయ అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుందని, ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం దందా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అధికారులు ఎన్నికల బిజీలో ఉంటుండడంతో ఇదే అదనుగా వ్యాపారులు ఎంచక్కా దిగుమతి చేసుకుంటున్నారు. సునాయాసంగా దిగుమతి చేసుకుంటూ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో నమ్మకమైన కొందరు వ్యక్తుల ఇళ్లలో చేరవేసి భద్రపరుస్తున్నారు. పత్తి విత్తడం జూన్‌ రెండో వారం నుంచి మొదలవుతుంది. ఒక నెల రోజుల ముందే రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తుంటారు. కాగా గతేడాది నుంచి ఈ తనిఖీ, నిఘాను పసిగట్టిన నకిలీ కేటుగాళ్లు ఆరు నెలల ముందుగానే ఎక్కువగా విక్రయాలు సాగే ప్రాంతాలకు క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు డపింగ్‌ చేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు