మేడిగడ్డ ద్వారానే గోదావరి జలాలు

16 May, 2017 04:17 IST|Sakshi

నాగారం(తుంగతుర్తి) : మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారానే ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలు సాధ్యమని, అందులో భాగంగానే మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ వద్ద ఎస్సారెస్పీ కాల్వ సీసీ లైనింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే  సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఎస్సారెస్పీ 71డీబీఎం కాల్వకు ఎనిమిది నుంచి పద్నాలుగున్నర కిలోమీటర్‌ వరకు రూ.10 కోట్లతో సీసీ లైనింగ్‌ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ నాటికి మేడిగడ్డ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఎస్సారెస్పీ ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లోని బీడు భూములను సస్యశ్యామలంగా చేస్తామన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గ  ప్రాంత ప్రజలకు 2018 నాటికి రెండు పంటలకు నీరందిస్తామని తెలిపారు.

 సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసే ప్రతి ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని చెప్పారు. 40 సంవత్సరాల క్రితం పాలకులు హెలికాఫ్టర్‌ ద్వారా సర్వే చేసి కాలువలు పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని, ఏళ్లు గడిచినా కాల్వలు పూర్తయ్యింది లేదని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ఓట్ల కోసమే కాల్వలను అసంపూర్తిగా నిర్మించారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సారెస్పీ కాల్వలకు 28 తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపుతామని, రూ.287 కోట్లతో ఎస్సారెస్పీ ఫేజ్‌–2 కాల్వ మరమ్మతులు పూర్తి చేయనున్నట్టు వివరించారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం మూడేళ్లలో పూర్తిచేశామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్‌ అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేలు, ఎంపీపీ దావుల మనీషా, తిరుమలగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాశం విజయయాదవరెడ్డి, ఎస్సారెస్పీ రెండో దశ ఎస్‌ఈ ఎ.వెంకటేశ్వర్లు, ఈఈ సుధీర్, డీఈఈలు ప్రవీణ్, రవికుమార్, సునీల్‌ప్రసాద్, ఏఈఈలు హరిక్రిష్ణ, బాలరాజు, కామేశ్వరి, అశోక్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌రెడ్డి, పాశం యాదవరెడ్డి, దావుల వీరప్రసాద్, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ గుజ్జ యుగేందర్‌రావు, తహసీల్దార్‌ పులి సైదులు, మండల అధ్యక్షుడు గుండగాని అంబయ్య, కుంట్ల సురేందర్‌రెడ్డి, గుడిపాటి సైదులు, ఉప్పలయ్య, కె.శోభన్‌బాబు, పానుగంటి నర్సిం హారెడ్డి, సర్పంచ్‌లు బి.సైదులు, లక్ష్మీనర్సు, గుండగాని సోమేష్, ఎంపీటీసీ వంగూరి రజిత, శ్రీను పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు