రూ.35 కోట్లతో గోదాముల నిర్మాణం

13 May, 2015 17:55 IST|Sakshi

మొయినాబాద్ (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో రూ.35 కోట్లతో 16 గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మొయినాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదాముకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతులు పండించిన పంటలను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేందుకు గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని చెప్పారు. రాజకీయలకు అతీతంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
 

మరిన్ని వార్తలు