ముస్లింలకు స్వర్ణయుగం

25 Jul, 2019 03:00 IST|Sakshi
బుధవారం సిద్దిపేటలో హజ్‌హౌస్‌ను ప్రారంభిస్తున్న మహమూద్‌ అలీ, హరీశ్‌రావు

హోం మంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేటలో హజ్‌హౌస్‌ ప్రారంభం

సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్‌ పాలన ముస్లిం మైనార్టీలకు స్వర్ణయుగం లాంటిదని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ మైనార్టీలకోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే అని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సిద్దిపేటలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన హజ్‌హౌస్‌ను బుధవారం వారు ప్రారంభించారు. కాగా, హైదరాబాద్‌ తర్వాత సిద్దిపేటలో మాత్రమే హజ్‌హౌస్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. దేశంలో ఎన్నోపార్టీలు ఉన్నాయని, వాటిల్లో టీఆర్‌ఎస్‌ ఒక్కటే సెక్యులర్‌ పార్టీ అని రుజువు చేసిందని మహమూద్‌ అలీ అన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని మతాలు, కులాలను సమానంగా చూడటమే కాకుండా సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయించారని పేర్కొన్నారు. గత పాలకులు మాటలు చెప్పి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్‌ భూము లు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. ఆ భూములన్నీంటిని పరిరక్షిస్తామని చెప్పారు.  
 
గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి.. 
మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ముస్లిం మైనార్టీలు భాగస్వాములన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో మైనార్టీ సోదరులు ముందువరుసలో ఉన్నారన్నారు. ముస్లిం మైనార్టీల కోసం సీఎం 204 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ పాఠశాలలను ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మహ్మద్‌ సలీం, ఫారూక్‌ హుస్సేన్, రాష్ట్ర హజ్‌ హౌస్‌ చైర్మన్‌ మసిహుల్లాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు