చదువుతోనే బంగారు భవిష్యత్‌   

7 Jul, 2018 13:55 IST|Sakshi
ఇంటర్‌ తరగతులను ప్రారంభిస్తున్న స్పీకర్‌ 

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

శాసనసభాపతి మధుసూదనాచారి

కస్తూరిబాలో ఇంటర్‌ తరగతులు ప్రారంభం

చిట్యాల: చదువు ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ ఉంది.. అందుకోసం మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక కస్తూరిబాగాంధీ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్‌ తరగతులను స్పీకర్‌ శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు దుప్పట్లు, నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఎంతో కష్టపడి చదువుకుని రాజ్యాంగ నిర్మాత అయ్యారని, పీపీ నర్సింహారావు బహుభాషా కోవిదుడిగా పేరుగాంచి భారత ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. గతంలో చదువుకోవడం కష్టంగా ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉత్తమ ఫలితాలు సాధించాల ని కోరారు.

ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేయాలని సూచించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా  స్పీకరును టీచర్లు, విద్యార్థులు సత్కరించారు. డీఈఓ శ్రీనివాసరెడ్డి, సెక్టోరియల్‌ అధికారి నిర్మల, ఎంపీడీఓ చందర్, సర్పంచ్‌ పుల్లూరి రమాదేవి, పరకాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుంభం రవీందర్‌రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ సుమలత, తహసీల్దార్‌ షరీఫ్‌మొహినొద్దీన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు