రోగ నిర్ధారణ కేంద్రాలకు మహర్దశ

16 Jun, 2015 04:30 IST|Sakshi

ల్యాబ్ ఫర్ లైఫ్ ప్రాజెక్టును చేపడుతున్న కేంద్రం
 వైద్యాధికారులతో నేడు హైదరాబాద్‌లో సమావేశం
 
సాక్షి, హన్మకొండ: ఇప్పటి వరకు మలేరియా, రక్త పరీక్షలకే పరిమితమైన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగనిర్థారణ పరీక్ష కేంద్రాల స్థాయి పెరగనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ల్యాబొరేటరీల్లో మౌలిక సదుపాయాల మెరుగు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాబ్స్ ఫర్ లైఫ్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ పథకాన్ని అమలు చేయడంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై తెలంగాణ వైద్యాధికారులతో నేడు హైదరాబాద్‌లో సమావేశం జరగనుంది.  
 
 పెరగనున్న సేవలు
 పేద ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చుల్లో రోగ నిర్ధారణ కోసం వెచ్చిస్తున్న మొత్తం ఎక్కువగా ఉంది. ఎక్కువశాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగనిర్థారణ కేంద్రాల మలేరియా, రక్త పరీక్షలే సాధ్యమవుతున్నాయి. మూత్రం, కళ్లె, రక్తం, టీబీ, డెంగ్యూ తదితర రోగాల నిర్థారణ  కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వైద్యఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ముఖ్యమైన రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా పేదరోగులపై పడే భారాన్ని తగ్గించేందుకు వీలుంది. ఈ మేరకు ల్యాబ్ ఫర్ లైఫ్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, రోగ నిర్ధారణ నిపుణులు (పాథాలజిస్టు)లకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అమెరికాకు చెందిన డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ సహకారాన్ని అందిస్తోంది.
 
 దేశంలో ఏడు రాష్ట్రాలు
 దేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదకొండు జిల్లాల్లో ల్యాబ్స్ ఫర్ లైఫ్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం జిల్లాలు ఎంపికయ్యాయి.
 

మరిన్ని వార్తలు