ట్రైనీ డీఎస్పీ, ఎస్సైల శిక్షణ ప్రారంభోత్సవంలో డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సమాజం మనకేం ఇచ్చిందన్న కోణంలో ఎప్పుడు ఆలోచించవద్దని, సమాజానికి మనమేం ఇస్తున్నాం అనేలా పనిచేయాలని డీజీపీ మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖలోకి నూతనంగా అడుగు పెడుతున్న ఒక డీఎస్పీ, 225 మంది ఎస్సై అభ్యర్థులకు మంగళవారం రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఇండక్షన్ ట్రైనింగ్ కోర్సు ప్రారం¿¶మైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదని, అలాం టి గొప్ప అదృష్టం పోలీసులకు దక్కుతుందని అన్నారు.
త్యాగస్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని ఆయన సూచించారు. సైబర్ టెక్నాలజీ, ఫోరెన్సిక్, హార్డ్వేర్ రంగాల్లో తర్ఫీదు పొంది టెక్నాలజీ పోలీసింగ్లో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. సాఫ్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకొని ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేసి ప్రజల మెప్పుపొందాలని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, డిప్యూటీ డైరెక్టర్లు నవీన్కుమార్, మురళీధర్ పాల్గొన్నారు.