ధైర్యం, నైతిక విలువలతో మంచి విజయాలు

12 May, 2019 02:24 IST|Sakshi
నల్సార్‌ లా యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చౌహాన్‌

న్యాయవాదులకు శిక్షణ శిబిరంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చౌహాన్‌

హైదరాబాద్‌: నమ్మకం, ధైర్యం, నైతిక విలువలు పాటించడం ద్వారా న్యాయవాదులుగా మంచి విజయాలను సాధించవచ్చని హైకోర్టు (ఏసీజే) ప్రధాన న్యాయమూర్తి చౌహాన్‌ పేర్కొన్నారు. శామీర్‌పేట్‌ గ్రామ పరిధిలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన ఐదు రోజుల న్యాయవాదుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులు చిరునవ్వుతోనే జయాపజయాలు సాధించవచ్చన్నారు. న్యాయవాదులు తన రోజువారీ వృత్తిలో భాగంగా కేసు పూర్వాపరాలకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోనే విధంగా వ్యాజ్యాన్ని నివేదించేందుకు ప్రాథమికంగా పాటించాల్సిన విషయాలను వివరించారు. ప్రతీ న్యాయవాది సమాజానికి ఒక బోధకుడిగా ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు.

నల్సార్‌ న్యాయవిశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం కేటాయించిన కార్పస్‌ ఫండ్‌పై వచ్చిన వడ్డీతో న్యాయవాదులకు ఆరోగ్యబీమా, ఆర్థిక సహా యం వంటి పలు సహకారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న న్యాయవాదులకు ప్రతి ఒక్కరికి రూ.10వేలు ఆర్థిక సహాయంతోపాటు పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ట్రస్టు చైర్మన్, అడ్వొకేట్‌ జనరల్‌ బండ శివానంద ప్రసాద్, యువన్యాయవాదులనుద్దేశించి పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో ట్రస్టు సలహాసభ్యులు మోహన్‌రావు, నల్సార్‌ రిజిస్ట్రార్‌ బాలక్రిష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాదులు మహమ్మద్‌ అలీ, బాబా తెల్కర్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు