యాభై లోపు పిల్లలున్న హాస్టళ్లు మూత!

17 Oct, 2019 11:25 IST|Sakshi

వసతి గృహాల్లో కనీసం వంద మంది పిల్లలుండాల్సిందే..

అంతకు తక్కువుంటే సమీప హాస్టళ్లలో విలీనం

వివరాలు సమర్పించాలని సంక్షేమ శాఖలకు ప్రభుత్వం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాలను హేతుబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,850 వసతి గృహాలున్నాయి. వీటిలో వెయ్యికిపైగా ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విడతల వారీగా గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేవడంతో వసతి గృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈక్రమంలో పిల్లల సంఖ్య అధారంగా హేతుబద్ధీకరిస్తే.. మరింత మెరుగైన సేవలు అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమరి్పంచాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. 

నిర్వహణ భారం ఎక్కువవుతున్న నేపథ్యంలో.. 
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో కనీసం వంద మంది పిల్లలుండాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలాచోట్ల ప్రీమె ట్రిక్‌ హాస్టళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 50 మంది వరకే ఉండటంతో నిర్వహణ భారమవుతోంది. ఈ నేపథ్యంలో 50 కంటే తక్కువ మంది విద్యార్థులున్న హాస్టళ్లను మూసేయాలని.. అక్కడున్న విద్యార్థులను సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని ప్రాథమికంగా తేల్చారు. ఈ దిశగా హాస్టళ్ల వారీగా విద్యార్థుల వివరాలు.. తక్కువున్న హాస్టళ్లకు సమీపంలో ఉన్న వసతిగృహాలు.. ఇలా నిర్దేశించిన కేటగిరీలో సమాచారాన్ని సమర్పించాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. ఈ క్రమంలో అధి కారులు వివరాల సేకరణకు ఉపక్రమించారు. ఈ నెలాఖరు లోగా పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు