ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం: లక్ష్మణ్

7 Mar, 2015 04:31 IST|Sakshi
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం: లక్ష్మణ్

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్ష వైఫల్యాలను ఎండగడతామని బీజేఎల్పీనేత డా.కె.లక్ష్మణ్ చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీసి అసెంబ్లీ నియమనిబంధనలకు అనుగుణంగా సభను స్తంభింపచేసైనా  సమాధానాన్ని రాబడతామన్నారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. పాలన పూర్తిగా గాడి తప్పిందని ధ్వజమెత్తారు. ఫిరాయింపులపై స్పీకర్‌కు, మండలిచైర్మన్‌కు హైకోర్టు నోటీసులిచ్చినా అధికారపక్షం విలువలు లేని రాజకీయాలు నడుపుతోందన్నారు.బీజేఎల్పీగా ప్రజల పక్షాన నిలిచి సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలను సాధించేందుకు అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకుంటామన్నారు. ముఖ్యమైన సమస్యలపై టీడీపీతోనే కాకుండా కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి సభలో సమన్వయంతో వ్యవహరిస్తామన్నారు.

శుక్రవారం పార్టీ నాయకులు ఎస్.కుమార్,పి.రాములుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిందని, కొత్త రాష్ర్టం, కొత్తప్రభుత్వంగా ఇచ్చిన గడువు కూడా తీరిపోయిందన్నారు.ఫిబ్రవరి చివరి వరకు బడ్జెట్ అమలు తీరును పరిశీలిస్తే గొప్పలకు పోయి రూ.లక్ష కోట్లకు పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. గత బడ్జెట్‌లో చాలా మటుకు ఎన్నికల  హామీల ప్రస్తావనే లేదన్నారు. జలహారం, చెరువుల పునరుద్ధరణ, పింఛన్లు, కల్యాణలక్ష్మి, దళితులకు భూ పంపిణీ వంటివి పేర్కొన్నా ఆచరణలో ఇవి అమలుకు నోచుకోలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం జీహేచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి శాసనసభ వరకు 5గురు ఎమ్మెల్యేలు, పార్టీ  నేతల పాదయాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏకు టీఆర్‌ఎస్ మద్దతునిస్తుందనేది ఊహాజనితమైన ప్రశ్న అని ఇచ్చిన హామీల అమలుకు పనిచేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని, దాని నుంచి వైదొలిగితే వదిలే ప్రసక్తే ఉండదని ఒక ప్రశ్నకు లక్ష్మణ్ బదులిచ్చారు.

మరిన్ని వార్తలు