ఎట్టకేలకు టీఆర్టీలకు మోక్షం

8 Jul, 2019 06:42 IST|Sakshi
మంత్రి నిరంజన్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న టీఆర్‌టీ అభ్యర్థులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2005 మందికి లబ్ధి

సాక్షి, వనపర్తి : టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్టీ) అభ్యర్థుల నియామకాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ ఏడాదైనా ప్రభుత్వం బడులు తెరిచే నాటికి నియమాకాలు చేపట్టాలనే వారి డిమాండ్‌ కొంచెం అటు, ఇటుగా ఫలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను ఆర్టీటీ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు 2017లో టీఆర్టీ పరీక్ష నిర్వహించి, ఇందుకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా.. ఎంపికైన వారికి నియమాక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లు  అయోమయ పరిస్థితిలో వారంతా కొట్టుమిట్టాడారు. ఇదే క్రమంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నా వారు నియమాకాల కోసం రోజుల తరబడి ఎదురుచూపులకు ఫలితం దక్కనుంది.

ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఎన్ని రోజుల ఎదురుచూపుల ఆశలు నేరవేరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా  ఉమ్మడి జిల్లా  కేంద్ర కలెక్టర్‌ చైర్మన్‌గా, జేసీ వైస్‌ చైర్మన్‌గా, డీఈఓ  కార్యదర్శిగా, జెడ్పీసీఈఓ లేదా ఇతర అధికారిని సభ్యులను కమిటీగా ఏర్పాటు చేసి, వారి ద్వారా నియమాకాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రోస్టర్, మెరిట్‌ జాబితా ప్రకారం ప్రభుత్వ పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. 

నాలుగు కేటగిరీల్లో నియామకాలు
టీఆర్టీల నియమకాలను ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా కమిటీలు నాలుగు కేటగిరిల్లో భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులుండి ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొత్త జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పోస్టులు భర్తీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా అభ్యర్థులు కౌన్సెలింగ్‌ హాజరుకాకపోతే మిగిలిన స్థానాల్లో నియమిస్తున్నట్లు వారికి రిజిష్టర్‌ పోస్టు ద్వారా సమాచారం అందించనున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 2005 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో  సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌( ఎస్‌జీటీ) 1465, స్కూల్‌ ఆసిస్టెంట్‌లు 391, ల్వాంగేజ్‌ పండిట్స్‌ 113, పీఈటీలు 36 మంది ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు