అభివృద్ధే తరువాయి

4 Mar, 2019 11:18 IST|Sakshi
మెదక్‌ పట్టణ వ్యూ..

నియోజకవర్గ అభివృద్ధి  నిధులు విడుదల 

మెదక్, నర్సాపూర్‌కు  రూ.3.70 కోట్లు..

ఒక్కో నియోజకవర్గానికి  1.85 కోట్ల కేటాయింపు

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం

మెదక్‌ అర్బన్‌: జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది.  మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో  2018–19 సంవత్సరానికి గాను రెండో విడత కింద రూ.3.70 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సెక్రటేరియట్, ప్లానింగ్‌ శాఖ నుంచి  శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఈ నిధుల్లో మెదక్‌ నియోజకవర్గానికి రూ.1.85 కోట్లు, నర్సాపూర్‌ నియోజకవర్గానికి రూ.1.85 కోట్ల చొప్పున  అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అభివృద్ధిపనులకు ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది. దీనికి కలెక్టర్‌ మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో తమతమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నేరుగా అభివృద్ధి పనులను చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఈ మేరకు జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి (సీపీఓ) శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నిధులను రెండు నియోజకవర్గాల్లో రహదారులు, మురికి కాల్వలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.   గతంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 2018–19 సంవత్సరానికి గాను మొదటి విడత,  మే నెలలో రూ. 90 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల్లో ఒక్కో నియోజకవర్గానికి రూ.45 లక్షలు చొప్పున విడుదల చేశారు.   ఈ నిధులతో వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి బోర్లు వేయించడం, మురికి కాల్వలు శుభ్రం చేయించడం, సీసీ రోడ్లు వేయించడంతో పాటు, పెండింగ్‌లోని సమస్యలు, అలాగే నియోజకవర్గంలో నెలకొన్న ఇతర చిన్నచిన్న ఇతర సమస్యలను ఎమ్మెల్యేలు పరిష్కారం కల్పించాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు