ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

8 Dec, 2017 04:45 IST|Sakshi

మార్చిలో హైదరాబాద్‌లో గొల్ల, కురుమల బహిరంగ సభ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కులవృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించాలనేది సీఎం కేసీఆర్‌ తపన అని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం సచివాలయంలోని అన్ని జిల్లాల గొర్రెల పెంపకందారుల సొసైటీల డైరెక్టర్లు, సభ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.5 వేల కోట్ల ఖర్చు తో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్న కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు మార్చిలో పెద్దఎత్తున గొల్ల, కురుమల బహిరంగసభను హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గొల్ల, కురుమల సంక్షేమ భవన నిర్మాణం కోసం రాజేంద్రనగర్‌ వద్ద 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు.

ఇందులో సంక్షేమ భవనం, హాస్టల్‌ను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. రైతులు తమ భూముల్లో గడ్డి పెంపకం చేపట్టేందుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.  ఈ కేంద్రాలకు పాలు విక్రయిస్తున్న రైతులకు 50 శాతం సబ్సిడీపై పాడి గేదెలను పంపిణీ చేసేందుకు ప్రభు త్వం సుమారు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్యయాదవ్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

మేత సరఫరాకు రెండు కమిటీలు..
గొర్రెల మేతను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కమిటీలను నియమించింది. మేత సరఫరా కోసం సాంకేతిక కమిటీ టెండర్‌ ప్రక్రియను నిర్వహించాలని, ఆర్థిక కమిటీ, సాంకేతిక కమిటీ నిర్ణయాలను పరిశీలించి అమలు చేయాలని సూచించింది.  

యాదవులంతా ఐక్యంగా ఉండాలి...మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
హైదరాబాద్‌: యాదవులంతా ఐక్యంగా ఉండి సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ నాగోలులోని శుభం కన్వెన్షన్‌ సెంటర్‌లో యాదవ, గొర్రెల కాపరుల సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ యాదవులు, గొర్రెలకాపరుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిం దన్నారు.

సీఎం చేపడుతున్న సంక్షేమ పథకాలతో గొల్ల, కురుమలు ఎంతో సం తోషంగా ఉన్నారని, త్వరలోనే గేదెల పంపిణీ ఉంటుందని, ఒక్కో గేదెకు రూ.80 వేలు ఖర్చు పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఫిష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ రాజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, జైపాల్‌ యాదవ్, కృష్ణ యాదవ్, గొర్రెలకాపరుల, యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు