సార్... ఆకలైతాంది

7 May, 2015 03:54 IST|Sakshi

 కామారెడ్డి : చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ప్రభుత్వం వేసవి బడులను ప్రారంభించింది. జిల్లాలో సుమారు 125 బడులు నడుస్తున్నాయి. వీటిలో సుమారు ఆరు వేల మంది చదువుకుంటున్నారు. వీరు ఉదయం 8  నుంచి 11 గంటల వరకు బడిలో ఉంటారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత సీఆర్పీలది. ఇంత వరకు బాగానే ఉన్నా వేసవి కాలం కావడంతో ఉదయమే బడికి వచ్చిన విద్యార్థులు ఆకలితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో బడికి వస్తూ 11 గంటల వరకు తరగతి గదిలోనే ఉంటున్నారు.

ఒక వైపు ఎండ వేడి, మరోవైపు ఆకలి అవుతుండడంతో 10 కాగానే సార్... ఆకలవుతుందని అంటున్నారు. ఆ సమయంలో వారిని ఇంటికి పంపించకపోతే మరుసటి రోజు బడికి రావడం లేరని సీఆర్పీలు చెబుతున్నారు. బడి ప్రారంభమైనప్పుడు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు ప్రస్తుతం ఉన్న సంఖ్యకు తేడా వచ్చిందని వారు వివరిస్తున్నారు. విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతూ బడికి రావడానికి మారాం చేస్తున్నారని వారు చెబుతున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగానే వసతుల  విషయంలోనూ అంతే శ్రద్ధ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
అల్పాహారమైనా పెట్టాలి
ఎండ, ఆకలితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కనీసం ఏదైనా అల్పాహారం పెడితే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఏవేవో కార్యక్రమాలతో లక్షలు ఖర్చు చేసే అధికారులు వారికి అల్పాహారం అందిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు.   అధికారులు స్పందిం చి వేసవి బడులకు వచ్చే విద్యార్థుల సం ఖ్య తగ్గకుండా చూడాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు