ఆరోగ్యశ్రీ  ఆగింది

17 Aug, 2019 03:15 IST|Sakshi

నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో మంత్రి ఈటల చర్చలు విఫలం

ప్రభుత్వ వాదన... 

  • ఇప్పటివరకు రూ. 450 కోట్ల బకాయిలు చెల్లించాం 
  • మిగిలిన బకాయిలు రూ. 600 కోట్లే 
  • వచ్చే నెలలో రూ. 200 కోట్లు చెల్లిస్తాం 
  • సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు సమ్మెలో లేవు 
  • బంద్‌ ప్రభావం పెద్దగా లేదు

ఆసుపత్రుల మాట... 

  • బకాయిలు రూ. 1,500 కోట్లు 
  • ఇప్పటివరకు 15–20 శాతం 
  • బకాయిలే అందాయి 
  • ప్యాకేజీ సొమ్ము పెంచాలి 
  • ప్రభుత్వంతో చర్చల్లో స్పష్టత రాలేదు 
  • నేడు, రేపు కూడా ప్రభుత్వంతో చర్చిస్తాం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిల చెల్లింపుపై ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆçస్పత్రులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బంద్‌ యథావిధిగా కొనసాగుతుందని ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆçస్పత్రులు స్పష్టం చేశాయి. అయితే కార్పొరేట్‌ ఆçస్ప త్రులు మాత్రం సమ్మెలో పాల్గొనడం లేదని ప్రభు త్వం తెలిపింది. ఇతర నెట్‌వర్క్‌ ఆçస్పత్రులు కూడా సేవలు నిలిపివేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలంటూ ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆçస్పత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) రోగులకు వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ఆయా ఆశాఖ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ భవన్‌లో చర్చలు జరిపారు. తెలంగాణ నెట్‌వర్క్‌ ఆçస్పత్రుల సంఘం, సూపర్‌ స్పెషాలిటీ ఆçస్పత్రుల  సంఘం తో వేర్వేరుగా చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు తాము రూ. 450 కోట్ల మేరకు బకాయిలు చెల్లించామని, మరో రూ. 600 కోట్ల బకాయిలే ఉన్నాయని స్ప ష్టం చేశారు. వివిధ దశల్లో ఉన్న బిల్లులను కూడా బకాయిలుగా ఆస్పత్రులు చెబుతున్నాయన్నారు. ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకూడదన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, మానవీయ కోణంలో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతా... 
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ప్యాకేజీ సొమ్ము పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వానికి  ప్రాధాన్యం కలిగిన అంశమన్నారు. ఆసుపత్రుల కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంలో సవరణలు చేయాలని కోరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఆ మేరకు తాము అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ రోగులకు, ఈహెచ్‌ఎస్‌ రోగులకు కూడా సేవలు అందడంలేదని మంత్రి దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా అటువంటి పరిస్థితి లేదన్నారు. ఎక్కడన్నా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. 

240 ఆస్పత్రుల్లో సేవలు బంద్‌
మొదటి రోజు 240 ఆస్పత్రుల్లో ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు నిలిపివేసినట్లు తెలంగాణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం నేత డాక్టర్‌ రాకేశ్‌ వెల్లడించారు. చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమకు ఎటువంటి స్పష్టత రాలేదని, అందువల్ల యథావిధిగా సేవల నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు. తాము రూ. 1,500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబితే, ప్రభుత్వం మాత్రం రూ. 800 కోట్లే ఉన్నా యంటోందన్నారు. దీనిపై మరోసారి ప్రభుత్వం తో చర్చలు జరుపుతామన్నారు. ఇటీవల రూ. 300 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తెలిపిందని, కానీ ఆయా ఆస్పత్రులకు ఆ మేరకు సొమ్ము వచ్చి న పరిస్థితి కనిపించడంలేదన్నారు. వచ్చే నెలలో బడ్జెట్‌ సందర్భంగా రూ. 200 కోట్లు చెల్లిస్తామని చర్చల్లో మంత్రి ఈటల పేర్కొన్నారని, అయినా బకాయిలు ఇంకా ఉంటాయన్నారు. శని, ఆదివారాల్లోనూ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరుపుతామన్నారు. కాగా, చర్చల సందర్భంగా ఒక కీలకాధికారి ఆరోగ్యశ్రీ ఆçస్పత్రులు తమ సొమ్ము తోనే బతుకుతున్నాయనంటూ చేసిన వ్యాఖ్యలపై ఆస్పత్రుల యాజమాన్యాలు మండిపడ్డాయి.   

మరిన్ని వార్తలు