బోధనాస్పత్రులపై ‘ఇతరుల’ ఆసక్తి 

29 Jun, 2019 02:32 IST|Sakshi

విరమణ వయసు పెంపుతో ఆ పోస్టులపై ప్రభుత్వ వైద్యుల మక్కువ  

స్పెషలిస్టు డాక్టర్లను తీసుకునేందుకు డీఎంఈ రమేశ్‌రెడ్డి అంగీకారం

సాక్షి, హైదరాబాద్‌: బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు ఇతర ప్రభుత్వ విభాగాల వైద్యులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, అనుబంధ బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇటీవల ప్రభుత్వం విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెం చింది. పెంపు ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. దీంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే అనేక మంది వైద్యులు బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. వారిని బోధనాస్పత్రుల్లో్ల పనిచేసేందుకు అనుమతించాలని వైద్య విద్యా సంచాలకులు.. ప్రజారోగ్య సంచాలకులను కోరినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే పీజీ పూర్తిచేసిన పీహెచ్‌సీ వైద్యులంతా కూడా బోధనాస్పత్రుల్లో్లకి వెళ్లే అవకాశముంది. కొత్తగా ప్రారంభించబోయే సూర్యాపేట, నల్లగొండ బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు వైద్యులు కావాలి. పైగా ఇతర మెడికల్, బోధనా స్పత్రుల్లోనూ కొరత నివారించే అవకాశముంది.  

ఒకేసారి 225 మంది బోధనాస్పత్రులకు...  
ఈసారి నుంచి పీజీ పూర్తిచేసిన వారిని తప్పనిసరిగా బోధనాస్పత్రులకు పంపించాలని సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఎందుకంటే ఇన్‌సర్వీసు కోటాలో పీజీ పూర్తిచేసిన స్పెషలిస్టుల వైద్య సేవలు ఉపయోగించుకోవాలనేది సర్కారు ఉద్దేశం. పైపెచ్చు విరమణ వయసు పెంపుతో అనేకమంది పీజీ చేసిన పీహెచ్‌సీ వైద్యులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దాదాపు 225 మంది స్పెషలిస్టు వైద్యులు బోధనాస్పత్రుల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇంత పెద్దసంఖ్యలో వైద్యులను బోధనా స్పత్రుల్లోకి పంపితే అక్కడ కొంత కొరత తీరు తుం దని భావిస్తున్నారు. డీఎంఈ వైపు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న స్పెషలిస్టుల వివరాలను పంపించాలని డీఎం హెచ్‌వోలకు శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేశారు. 

మరిన్ని వార్తలు