‘పోలీసులు నాపై దాడి చేశారు’

29 Apr, 2019 11:31 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : పెట్రోలింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసులు దాడికి పాల్పడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు మేరకు...దుర్గా ప్రసాద్‌ వ్యక్తి బాన్సువాడ మండలం కోయగుట్ట గురుకుల పాఠశాలలో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో రుద్రూరు సమీపంలోని రైస్‌మిల్లు వద్ద పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. దీంతో తమకు ఎదురుపడిన దుర్గాప్రసాద్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా పోలీసులు డిమాండ్‌ చేశారు.

ఈ క్రమంలో తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు దుర్గాప్రసాద్‌ పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లి బూటు కాళ్లతో తన్నారు. అనంతరం బోధన్‌ ఏరియా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. ఈ విషయంపై సీపీ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. దాడి చేసిన వారిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అతడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాధితుడు తాగి పడిపోవడంతోనే గాయాలపాలయ్యాడని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు