అక్షరం వస్తే ఒట్టు!

30 Sep, 2019 11:06 IST|Sakshi
ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న విద్యార్థులు

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారికి సామర్థ్యాలు లేవని తేల్చిన ప్రీ టెస్ట్‌

ఏబీసీ కార్యక్రమం అమలు కోసం జూలైలో ప్రీ టెస్ట్‌ నిర్వహించిన ప్రభుత్వం

రెండు జిల్లాలో తెలుగు రాని వారు 14,339, ఇంగ్లీష్‌ రాని విద్యార్థులు 28,543 మంది

గణితం, చదవడం, రాయడం చదుర్విద ప్రక్రియలు తెలియని వారు 30,149 మంది

ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతున్న ఫలితాలు

సాక్షి, మహబూబ్‌నగర్‌: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల గురించి ఇటీవలే చేదు నిజాలు బయటపడ్డాయి. కనీసం చదవడం, రాయడం, ఎక్కాలు కూడా రాని స్థితిలో ఉన్నారని తేలింది. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతుండగా చదవు చెప్పిన ఉపాధ్యాయులు ఏం చేద్దామని ఆందోళనలో పడ్డారు.  

సర్వేలోని నిజాలివే.. 
విద్యార్థుల కనీస సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం జూలై నుంచి ఏబీసీ పేర వివరాల సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కనీస సామర్థ్యాలు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడం వంటి అంశాలు ఎంతమేర వస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుత్వం గత నెల రెండో వారంలో ఈ ప్రక్రియను ప్రారంభించింది. 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీ టెస్ట్‌ నిర్వహించగా అందుకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేసింది. అయితే విద్యార్థులకు మాతృభాష అయిన తెలుగు కూడా చదవడం, రాయడం  రాదని, రెండో ల్యాంగేజ్‌ అయిన ఇంగ్లీష్‌ కూడా రావడంలేదని బయటపడింది. ఈ పరీక్ష ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న నాణ్యతను ప్రశ్నించే విధంగా ఉంది. సంవత్సరం పొడవునా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తెలుగు చదవడం రాదంటే, పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. ఈ క్రమంలో జూలై 19 నుంచి ప్రారంభమైన ఏబీసీ కార్యక్రమం 60 రోజుల పాటు నిర్వహించి, ఈనెల చివరికల్ల ముగిసే విధంగా అధికారులు ప్రణాళికలు రచించారు. అనంతరం మళ్లి పోస్టు పరీక్ష కూడా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు పరీక్షలు అనంతరం కూడా అధికారులు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం. 

ఏబీసీ కార్యక్రమం.. 
ఏబీసీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ప్రీటెస్టులో 80 శాతం మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారిని గ్రూప్‌ ఏ విద్యార్థిగా, చదవడం, రాయడం అంతంత మాత్రంగా వచ్చిన వారిని గ్రూప్‌ బీ వారిగా, రాయడం, చదవడం రాని విద్యార్థులను గ్రూప్‌ సీగా విభజిస్తారు. ఇందులో ఏ గ్రూప్‌లో ఉన్న విద్యార్థులకు సాధారణ తరగతుల్లో సబ్జెక్టులు మాత్రమే బోదిస్తారు. మిగతా రెండు గ్రూప్‌లకు చెందిన విద్యార్థులకు సాధారణ తరగతులతో పాటు, కనీస సామర్థ్యాలు పెంచే విధంగా ఉపాద్యాయులు ప్రత్యేక బోదన చేయాల్సి ఉంది. ఇందులో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సీ నుంచి బీకి, బీ నుండి సీకి వచ్చే విధంగా శిక్షణ కొనసాగుతుంది. ఇలా 60 రోజుల కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మొత్తం ఏ గ్రూప్‌లోకి రావాల్సి ఉంది.  

పరీక్షలో ఫలితాల సరళి 
పరీక్షను జూలై నెల 17, 18వ తేదిలో నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 1,439 మంది పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య 1,63,420 మందిగా ఉంది. కానీ పరీక్షకు హాజరైన విద్యార్థులు 75,439 మందిగా ఉంది. ఈ పరీక్ష  కేవలం 3వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా(మొదటి ల్యాంగ్వేజ్‌) ఉర్డూ,  తెలుగు రాయడానికి, చదవడానికి  రాని విద్యార్థుల సంఖ్య 14,339 మందిగా ఉంది. ఇందులో బాలికలు 7,394 మంది కాగా, బాలురు 6,945 మంది. అంతేకాకుండా ఇంగ్లీష్‌ చదవడానికి, రాయడానికి రాని విద్యార్థులు 28,543 మంది ఉన్నారు. ఇందులో బాలికలు 14,902 మంది కాగా, బాలురు 13,641 మంది ఉన్నారు. వీటితో పాటు చదుర్విద గణిత ప్రక్రియలు రాని విద్యార్థులు 27,733 మంది ఉన్నారు. అసలు గణితం చదవడం, రాయడం, ప్రక్రియలు రాని విద్యార్థులు 30,149 మంది ఉన్నారు. ఇందులో బాలికలు 15,583 మంది కాగా, బాలురు 14,566 మంది ఉన్నారు.  

పనితీరుకు నిదర్శనం 
ప్రీటెస్టు ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సంవత్సరంలో 9నెలలు పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థికి కనీసం మాతృభాషలో కూడా చదవడానికి రాలేని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ఇంగ్లీష్, సైన్స్, గణితం వంటి వాటిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యానికి తూట్లు పడుతున్నట్లు ఆరోపణలు వినిస్తున్నారు. పరిస్థితి మారాలి, విద్యార్థులకు కనీస సమర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలి, బోధనలో నిర్లక్ష్యం వహించవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా పెద్దగా ఫలితం కనిపిండం లేదు. వీటితో పాటు పదో తరగతి ఫలితాల్లో కూడా ఇలాంటి పరిస్థితే పునరావతం అయ్యింది. జిల్లాలోను రాష్ట్రంలో 30వ స్థానంలో నిలబెట్టారు. ఈ సారి ప్రీటెస్టులో అయిన మంచి ఫలితాలు వస్తాయని, జిల్లా విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

సామర్థ్యాలు పెంపొందిస్తాం  
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాసామర్థ్యాలు తెలుసుకునేందుకు జూలైలో ప్రీ టెస్టు నిర్వహించాం. ఇం దులో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ద్వారా బోధస్తున్నాం. అందుకోసమే ఏబీసీ కార్యక్రమం ని ర్వహించాం. ఈనెల చివరి నాటికి పూర్తి స్థాయిలో విద్యార్థుల విద్యాసామర్థ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
– నాంపల్లి రాజేష్, డీఈఓ, మహబూబ్‌నగర్‌  

మరిన్ని వార్తలు