‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’ 

10 Aug, 2019 02:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో హైదరాబాద్‌లోని అన్ని రవాణా వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు తప్పనిసరి చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళల భద్రతపై డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పోలీసు అధికారులతోపాటు విమెన్‌ సేఫ్టీ వింగ్‌ చీఫ్, ఐజీ (ఎల్‌ అండ్‌ వో) స్వాతి లక్రా, రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మహిళల భద్రత గురించి తీసుకోవాల్సిన అంశాలే కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అనుమతి ఉన్న కార్లు, ఆటోలు తదితర రవాణా వాహనాలకు జీపీఎస్‌ సౌకర్యం ఉండాలని రవాణా అధికారులు సూచించారు. నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని, పలు ప్రజా రవాణా వాహనాల్లోనూ సీసీ కెమెరాలను అమర్చాలని సమావేశం అభిప్రాయపడింది. 

మరిన్ని వార్తలు