ఇక పంచాయతీల్లో పారదర్శకం 

25 Aug, 2019 11:28 IST|Sakshi

స్థాయీ సంఘాల ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి

ప్రతీ గ్రామంలో నాలుగు కమిటీలు.. ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులు

ఈనెల 29వ తేదీలోగా పూర్తికి కలెక్టర్‌ ఆదేశాలు

సాక్షి, వరంగల్‌/భీమదేవరపల్లి: తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లో భాగంగా ఏర్పాటు కానున్న స్థాయీ సంఘాల(స్టాండింగ్‌ కమిటీ)తో గ్రామ పంచా యతీ పాలన పారదర్శకంగా సాగే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థలకు గ్రామ పరిపాలన పగ్గాలు అప్పగించాలన్న ధ్యేయంతో 73, 74వ రాజ్యాంగ సవరణలతో పంచాయతీల స్థాయిలో అభివృద్ధి కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని పొందుపర్చారు. కానీ ఈ విషయాన్ని గతంలో పట్టించుకోలేదు. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే సర్పం చ్‌ స్థాయిలోనే పెనుమార్పులతోనే సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి రూపకల్పన చేశారు.

జల భాగస్వామ్యం కోసం...
గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రజలను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొం దించింది. అందులో భాగంగానే ప్రతీ గ్రామపంచాయతీకి నాలుగు స్టాండింగ్‌ కమిటీలతో పాటుగా ఒక్కో గ్రామ పంచాయతీకి ముగ్గురు చొప్పున కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను 29వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, జిల్లాలోని మొత్తం ఏడు మండలాల్లో ఉన్న 130 గ్రామాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామానికి అన్ని కమిటీలు కలిపి 63 మంది సభ్యులుగా ఉండనున్నారు. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో 8,190 మందికి కమిటీలో అవకాశం దక్కుతుంది.

అభివృద్ధి వేగిరం
గ్రామపంచాయతీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల్లో మంజూరైన పనులు త్వరతగతిన పూర్తి అయ్యేందుకు ఈ కమిటీలు పరోక్షంగా దోహదం చేస్తాయి. ఇప్పటి వరకు పంచాయతీల నిధులతో చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకే సర్పంచ్‌ల పూర్తి సమయం సరిపోయేది. ఈ కమిటీల ఏర్పాటుతో  చేపట్టిన పనుల నాణ్యతపై కూడా దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఈ కమిటీల్లో విషయ నిఫుణులు, అనుభవం గల వారికి ప్రాతినిధ్యం కల్పించనుండడంతో గ్రామాల అభివృద్ధి పరుగులు తీస్తుందని భా విస్తున్నారు.

ఎన్నిక విధానం
ప్రతీ కమిటీలో 15 మంది సభ్యులకు తక్కువ కాకుండా.. ఈఓ పీఆర్‌డీల సమక్షాన కమిటీలను ఏర్పాటుచేయాలి. ఇందులో ఒకరిని కన్వీనర్‌గా ఎన్నుకోవాలి. కమిటీ సభ్యులంతా గ్రామ నివాసితులై, ఆ గ్రామ ఓటరై ఉండాలి. వార్డు సభ్యులకు ఈ కమిటీల్లో స్థానం ఉండదు. ఇక కమిటీల వారీగా అవగాహన కలిగిన అనుభజ్ఞులైన, నిష్ణాతులైన వ్యక్తులను కమిటీల్లోకి తీసుకోవాలి. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు కమిటీ ఎంపిక పూర్తిచేయాలి.

ముగ్గురు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ మాదిరిగా గ్రామపంచాయతీల్లోనూ ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. జెడ్పీల్లో ఇద్దరు, మండలాల్లో ఒకరిని మాత్రమే కో–ఆప్షన్‌ సభ్యుడిని ఎన్నుకోగా గ్రామపంచాయతీల్లో మాత్రం ముగ్గురిని ఎన్నుకునేలా నూతన చట్టంలో పేర్కొన్నారు. ఈ కోప్షన్‌ సభ్యుల్లో ఒకరు సీనియర్‌ సిటిజన్, ఒకరు విశ్రాంత ఉద్యోగి(గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన దాత, పారిశ్రామిక వేత్త, ఎన్‌ఆర్‌ఐ), మరొకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలై ఉండాలి. ఈ సంఘాలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న సంఘం అధ్యక్షురాలికి అవకాశం కల్పిస్తారు. వీరు పంచాయతీల అభివృద్ధి కోసం గ్రామ పాలకవర్గం, స్టాండింగ్‌ కమిటీలతో కలిసి పనిచేస్తారు. 

అధికారుల కసరత్తు
జీపీల్లో స్థాయి సంఘాల ఏర్పాటును ఈనెల 29లోగా పూర్తిచేసి 31లోగా జిల్లా పంచాయతీ అధికారికి అందచేయాలని కలెక్టర్‌ ఆదేశించిన నేపథ్యంలో అధికా రులు కసరత్తు ప్రారంభించారు. సర్పంచ్, ప.కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని, వీటి ఏర్పాటును ఎంపీడీఓలు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఎన్నికకు సంబంధించి నోటీస్‌ బోర్డు ద్వారా తెలియజేయాలి.

స్థాయీ సంఘాలు ఇవే...

కమిటీ – 1 : పారిశుధ్యం, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక నిర్వహణ

కమిటీ – 2 : వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ

కమిటీ – 3 : మొక్కల పెంపకం, పచ్చదనం పెంపు

కమిటీ – 4 : పనులు, సంతల పర్యవేక్షణ

మరిన్ని వార్తలు