మనవడి ని పెళ్లి కొడుకును చేసి...

6 Feb, 2015 18:50 IST|Sakshi
మనవడి ని పెళ్లి కొడుకును చేసి...

ముషీరాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడు పెళ్లికొడుకయ్యాడు. అతడిని తనివి తీరా చూసుకొని.. నిండు మనసుతో దీవించిన ఆమె సంతోషం పట్టలేకో ఏమో... అంతలోనే అనంతలోకాలకు వెళ్లి పోయింది. దీంతో ఆ పెళ్లి మండపంలో మోగాల్సిన భాజాభంత్రీలు మూగబోయాయి. పెళ్లిని తాత్కాలికంగా నిలిపి వేసి అమ్మమ్మ అంత్యక్రియలను నిర్వహించారు. వివరాలు.. ముషీరాబాద్‌లోని సాయిరెడ్డి పటేల్‌నగర్ అందరికీ సుపరిచితం. 1950కు ముందు ఆ ప్రాంతంలో సాయిరెడ్డిపటేల్  పెద్ద భూస్వామి. అతనికి చెందిన భూములే రాంనగర్, అడిక్‌మెట్ తదితర ప్రాంతాలు. అతను మృతి చెందాక అతను ఉండే వీధిని సాయిరెడ్డి పటేల్‌నగర్‌గా పిలుస్తున్నారు. అతని ము నిమనవడు సందీప్‌రెడ్డి వివాహం - మేఘనతో  గురువారం ఉదయం 11 గంటలకు కొంపల్లిలో జరగాల్సి ఉంది.

 

అయితే వివాహానికి ముందు బుధవారం రాత్రి సందీప్‌రెడ్డిని అతడు నివసించే అల్వాల్‌లో పెళ్లి కొడుకును చేశారు. ఈ వేడుకకు సాయిరెడ్డిపటేల్ కొడుకు రాంచంద్రారెడ్డి భార్య దేవేంద్రమ్మ ముషీరాబాద్ నుంచి వచ్చారు. మనువడిని పెళ్లి కొడుకును చేయగా చూసి మనసారా దీవించింది. కొద్దిసేపటికే అక్కడే కన్ను మూసింది.  దీంతో వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.  భౌతిక కాయాన్ని ముషీరాబాద్‌కు తీసుకొచ్చి బాపూజీనగర్ శ్మశాన వాటికలో నిర్వహిం చారు. దీంతో సాయిరెడ్డిపటేల్ గల్లీతో పాటు ముషీరాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

మరిన్ని వార్తలు