వేటుపడింది

19 Mar, 2016 03:37 IST|Sakshi

గ్రానైట్‌కు అక్రమ విద్యుత్ వ్యవహారంఇద్దరు సెస్ ఉద్యోగుల సస్పెన్షన్
విచారణ అధికారిగా ఏడీ రాజిరెడ్డినాయకుల ఒత్తిళ్లతో ఉద్యోగులు బలి
వారిపైనా చర్యలు తీసుకోవాలి ఎంప్లాయూస్ సంఘం డిమాండ్

 
 వేములవాడ రూరల్ : వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ శివారులోని గ్రానైట్ క్వారీలో అక్రమ విద్యుత్ వినియోగం వ్యవహారం విషయంలో ఇద్దరు సెస్ ఉద్యోగులపై వేటుపడింది. సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడంతో సెస్ ఎండీ నాంపల్లిగుట్ట వేములవాడ రూరల్ ఏఈ తిరుపతి, సంకెపల్లి అసిస్టెంట్ హెల్పర్ దేవయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంకా ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయూన్ని తేల్చేందుకు ఏడీ రాజిరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. గ్రానైట్ క్వారీ యజమాని ఎలాంటి అనుమతి లేకుండా ఏకంగా 12 స్తంభాలు వేసుకొని విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకుంటున్నాడు.

దీనిపై ఫిర్యాదులు అందడంతో సెస్ ఎండీ నాంపల్లిగుట్ట గురువారం క్వారీని పరిశీలించారు. క్వారీ యజమాని ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో శుక్రవారం ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

 నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గని చైర్మన్
సెస్ ఉద్యోగులపై వేటు వేయకుండా ఉండేట్లు చూడాలని, ఈ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవద్దని అధికార పార్టీ నాయకులు, సెస్ పాలకవర్గంలో ఉన్న కొంతమంది నాయకులు ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాత్రం తలొగ్గలేదు. నూతన పాలకవర్గంపై మచ్చపడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోక తప్పలేదు. ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లడంతో చైర్మన్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వీరిద్దరే కాకుండా మరికొందరిపైనా వేటు వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

 ఎంప్లాయిస్ యూనియన్‌లో వ్యతిరేకత..
అక్రమ విద్యుత్ వ్యవహారంలో సెస్ ఉద్యోగులపై వేటు వేయడాన్ని ఎంప్లాయిస్ యూనియన్ తీవ్రంగా పరిగణిస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల మేరకే వారు క్వారీ యజమానికి సహకరించారని, వారిపై చర్యలు తీసుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనియన్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. నాయకుల ఒత్తిళ్లకు ఉద్యోగులు తలొగ్గారని, వారిని బలిపశువులుగా చేయడం ఎంతవరకు సమంజసమని అధికారుల తీరుపై మండిపడ్డట్లు సమాచారం. విద్యుత్ అక్రమానికి సంబంధం ఉన్న సెస్ డెరైక్టర్‌పై, క్వారీ యజమానిపై చర్యలు తీసుకున్నాకే ఉద్యోగులపై వేటు వేయాలని పట్టుబట్టినట్లు తెలిసింది.

 ఉద్యోగులకేనా వేటు..?
 అక్రమ విద్యుత్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన సెస్ అధికారులు, పాలకవర్గం దానికి బాధ్యులైన క్వారీ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని చర్చించుకుంటున్నారు. క్వారీ యజమానిపై కేసు పెడుతారా? లేక జరిమానాతోనే వదిలివేస్తారా? అనేది చర్చనీయూంశమైంది. ఒకవేళ ఈ ఉద్యోగులను మాత్రమే బలిచేసి, క్వారీ యజమానిపై, దానికి సంబంధమున్న నాయకునిపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే... చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఉద్యోగ సంఘం నాయకులు చ ర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు