10 జీవోలు.. రూ.103 కోట్లు! 

5 Sep, 2018 02:50 IST|Sakshi

పెండింగ్‌లో ఉన్న పనులకు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధుల విడుదల ప్రక్రియను కొనసాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం రూ.103.06 కోట్ల నిధులను మంజూరు చేయడం, విడుదల చేయడం ఒకేరోజు పూర్తయ్యాయి. మంగళ వారం ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు పది వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. 

నిధుల మంజూరు ఇలా.. 
- భూపాలపల్లి అసెంబ్లీ నియోజవకర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.34.69 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది.
గజ్వేల్‌ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్‌లలో ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణం కోసం రూ.ఐదు కోట్లను విడుదల చేసింది. ఒక్కో ఫంక్షన్‌ హాల్‌కు రూ.కోటి చొప్పన కేటాయించింది. తూప్రాన్‌లో వైకుంఠ ధామం (శ్మశాన వాటిక) నిర్మాణానికి రూ.కోటి విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఈ మేరకు నిధులు విడుదల చేసింది.
డోర్నకల్‌ నియోజకవర్గంలోని ఉగ్గంపల్లి, నర్సింహులపేట, కందికొండ ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2.40 కోట్లను విడుదల చేసింది. ఇందులో నర్సింహులపేట, కొందికొండ ఆలయాలకు రూ.కోటి చొప్పున, ఉగ్గంపల్లి ఆలయానికి రూ.40 లక్షలు కేటాయించింది.
ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు వేయాల్సిన 299 బోర్ల కోసం రూ.2.11 కోట్లను, బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 52 బోర్లను వేసేందుకు రూ.75 లక్షలను విడుదల చేసింది.
-నల్లగొండ జిల్లాలో చేపట్టిన రజక భవన్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన రూ.50 లక్షలను మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల కోటాలో వీటిని కేటాయించింది.  అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని 44 బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.55.61 కోట్లను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీల మేరకు ఈ నిధులు మంజూరయ్యాయి.
కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం కందికొట్కూర్‌లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.కోటి విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు