ఇంజినీర్లూ.. మీ పనితీరు బాలేదు

29 Apr, 2020 13:41 IST|Sakshi
‘వావ్‌ వరంగల్‌’ లోగో వద్ద సూచనలు చేస్తున్న కమిషనర్‌

కట్టుకథలతో కాలం వెళ్లదీయొద్దు

గ్రేటర్‌ ఇంజినీర్లకు కమిషనర్‌ క్లాస్‌

వరంగల్‌ అర్బన్‌: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, కనీస నిబంధనలు అమలు కావడం లేదు... ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతోనే ఇలా జరుగుతోంది.. అని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్, హన్మకొండలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు సీకేఎం కాలేజీ మైదానంలో నిర్మించిన వాకింగ్‌ ట్రాక్‌ పనులను ఆమె మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యత లోపించినట్లు గుర్తించిన ఆమె ఇకనైనా ఇంజనీర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టుకథలతో కాలం వెళ్లదీయకుండా పనిపై దృష్టి సారించాలని సూచించారు.

అలాగే, వరంగల్‌లోని అంధుల లూయిస్‌ పాఠశాల భవన పునఃనిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పూర్తయి, అగ్రిమెంట్‌ జరిగినా పనులు చేపట్టని కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని తెలిపా రు. ఇక వరంగల్‌ 28వ డివిజన్‌లో మహిళా కమ్యూనిటీ భవన పనులు,వరంగల్‌ ఆటోనగర్‌లో స్మృతి వనానికి వెళ్లే అప్రోచ్‌ రోడ్డు పనులు చేపట్టాలని, ఏ నుమాముల మార్కెట్‌రోడ్డు విస్తరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.ఈతనిఖీల్లో డీఈ రవీందర్,ఏఈలు కృష్ణమూర్తి,కార్తీక్‌ పాల్గొన్నారు.

సుందరంగా ‘వావ్‌ వరంగల్‌’
కాజీపేట ఫాతిమా నగర్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసి న ‘వావ్‌ వరంగల్‌’ లోగోను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ఫాతి మానగర్‌ వద్ద పనులను పరిశీలించిన కమిషనర్‌... అందమైన చిత్రాలు వేయించడంతో పాటు వాటర్‌ ఫాల్స్‌ ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో సీహెచ్‌ఓ సునీత, డీఈ రవీకిరణ్, ఏఈ శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు