పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

3 Feb, 2019 01:20 IST|Sakshi

ప్రత్యేక టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు కూడా 

త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు మార్గం సుగమమైంది. స్పెషల్‌ టీచర్లుగా పనిచేస్తున్న వారికి నోషనల్‌ ఇంక్రిమెంట్ల మంజూరీకి సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఫైలును ఆమోదించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,487 భాషా పండితులు, 1,047 మంది పీఈటీలు స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు పదోన్నతి పొందనున్నారు. అదేవిధంగా స్పెషల్‌ టీచర్లుగా నియమితులైన వారికి రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు సంబంధిత ఫైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11,363 మంది టీచర్లు లబ్ధి పొందనున్నారు. వీరిలో 7,010 మంది ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతుండగా, ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు 4,353 మంది ఉన్నారు. వీరికి నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.54 కోట్ల భారం పడనుంది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పూల రవీందర్, కె.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా విద్యా శాఖలోని వివిధ వర్గాల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచర్లకు 12 నెలల వేతనం, మహిళా ఉద్యోగులకు సెలవులు, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, ఉపాధ్యాయుల పదోన్నతులు తదితర సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు