డీఈవో కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ సెల్‌.. 

12 Nov, 2018 03:17 IST|Sakshi

ప్రధానోపాధ్యాయులు, టీచర్ల సమస్యలపై సత్వర స్పందన కోసం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయా ల్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా గ్రీవెన్స్‌ సెల్‌ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారం పొందవచ్చని తెలిపింది. ఒకవేళ అక్కడ సమస్యకు పరిష్కారం లభించకుంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ దృష్టికి తీసుకురావాలని, సాధ్యాసాధ్యాలను చూసిన తర్వాత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఈ భావిస్తోంది.

ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సర్వీసుకు సంబంధించిన అం శాలు, బదిలీలు, మార్పులు చేర్పులంటూ వంద లాది మంది టీచర్లు డీఎస్‌ఈ చుట్టూ చక్కర్లు కొట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

ఫోన్‌ చేస్తే చర్యలే..! 
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ చాలామంది టీచర్లు మార్పులు, చేర్పులంటూ డీఎస్‌ ఈ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు పైరవీలు చేస్తూ ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులతో విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్లు చేయిస్తూ అసౌకర్యం కల్పిస్తున్నారని భావించిన డీఎస్‌ఈ ఈ మేరకు సూచనలు చేసింది. బదిలీలు, మార్పులు, సర్వీసు సంబంధిత అంశాలపై ఫోన్‌ కాల్స్‌ వస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టి.విజయ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. ఈ సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తే సీసీఏ రూల్స్‌ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు