నగరంలో హడలెత్తించిన జీఎస్టీ దాడులు

21 Dec, 2019 01:36 IST|Sakshi

ఓ సినీ హీరో, హీరోయిన్‌ సంస్థలు, ఇళ్లలో సోదాలు

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తోపాటు నగరంలోని 23 ప్రాంతాల్లో జీఎస్టీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రూ.కోట్లలో సర్వీస్‌ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు జూబ్లీహిల్స్‌లోని ఓ వర్ధమాన సినీనటి నివాసంపై దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సదరు హీరోయిన్‌ షూటింగ్‌ రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ నటి రూ.20 లక్షల వరకు ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉందని సమాచారం. చిట్‌ఫండ్, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతోపాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు, తదితర ఆఫీసుల్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఎంబీబీఎస్‌ సీట్ల కోసం విద్యార్థులను విదేశాలకు పంపే కన్సల్టెన్సీలు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. బుధవారం నుంచి జీఎస్టీ అధికారులు జంటనగరాల్లో దాడులు జరుపుతున్నారు. వీటిలో ఓ సినీనటుడి వ్యాపార సంస్థలతోపాటుగా పలు మౌలిక సదుపాయాల కంపెనీలు, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, స్టీలు వ్యాపారాలపై బుధవారం చేసిన దాడుల్లో దాదాపు రూ.40 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు.

మరిన్ని వార్తలు