‘త్రీఐ’లతోనే దేశం పురోభివృద్ధి

29 Jun, 2019 02:37 IST|Sakshi
రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌ çపుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ తదితరులు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

స్టార్టప్‌లతో దేశానికే మార్గదర్శకం 

‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’ పుస్తక ఆవిష్కరణ 

రాయదుర్గం: ఇన్నోవేషన్, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (త్రీఐ)లతో దేశం పురోభివృద్ధి సాధిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రాయదుర్గంలో శుక్రవారం ‘ది స్టార్టప్‌ వే– మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో భారతదేశం బాగుపడేందుకు ఏం చేయాలని ప్రశ్నించగా.. తాను పలు సలహాలు ఇచ్చినట్లు చెప్పారు. అందుకోసం ‘త్రీఐ’ల గురించి వివరించినట్లు కేటీఆర్‌ తెలిపారు. వీటకి ప్రాధాన్యం ఇస్తే దేశీయ ఉత్పత్తులు పెరిగి, పోటీతత్వంతో అభివృద్ధి సాధ్యమని చెప్పినట్లు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహించడంతోనే స్టార్టప్‌లు దేశానికే ఆదర్శంగా మారారని చెప్పారు. యువకులు, ఉత్సాహవంతులంతా వినూత్నంగా ఆలోచించి, ఉత్పత్తి ఆధారిత స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇస్తే, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుంటోందన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ కుమారుడు దేశంలో మొదటిసారిగా మారుత్‌డ్రోన్స్‌ స్టార్టప్‌ ద్వారా ప్రేమ్‌ దోమల నివారణకు మంచి పరిష్కారం కనుగొని డ్రోన్‌ సేవలను ప్రభుత్వం వినియోగి స్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం టీహబ్, వీ–హబ్, రిచ్, వంటివి ఎన్నో ప్రారంభించిందని, త్వరలో టీహబ్‌–2ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. 

48 ఇంక్యుబేషన్‌ సెంటర్లు 
తెలంగాణ రాష్ట్రంలో మెంటర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఐటీ శాఖా ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌ వెల్లడించారు. మెంటర్లు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతం లోని వినూత్నంగా ఆలోచించే సామాజిక సమస్యల పరిష్కారానికి రూపొందించే స్టార్టప్‌లకు చేయూత, ప్రోత్సాహం, సలహాలు ఇచ్చేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటు అవసరమని గుర్తించిందన్నారు. 2014లో ట్రిపుల్‌ఐటీలోని సీఐఈ, డీల్యాబ్‌ రెండు ఇంక్యుబేషన్‌ సెంటర్లలో 200 వరకు స్టార్టప్‌లుండేవని, ప్రస్తుతం 48 ఇంక్యుబేషన్‌సెంటర్లలో 3వేలకుపైగా స్టార్లప్‌లు రూపొందాయని రాష్ట్ర ఐటీశాఖా ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఏర్పాటు చేసి రెడ్‌బస్‌ వ్యవస్థాపకులు ఫణీంద్రసమాను బా«ధ్యతలు అప్పగించామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని వారిని ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  
– ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ 

వారి విజయమే.. ‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’ 
హైదరాబాద్‌లో విజయవంతంగా స్టార్టప్‌లను ప్రారంభించి నిర్వహిస్తున్న 25 మంది స్టార్టప్‌ వ్యాపారుల విజయగాథలతో కూడిన పుస్తకమే ‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’. దీన్ని ఎం.సోమశేఖర్, సత్య అయ్యగారి, సురేశ్‌థరూర్, వర్షాబిల్‌గారీ, శుష్మనాయక్, నేహజా రైటర్స్‌గా వ్యవహరించగా, ఎడిటర్‌గా వనజా బనగారి వ్యవహరించారు. 

సంతోషంగా ఉంది.. 
సక్సెస్‌ స్టార్టప్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు వచ్చి ఒక పుస్తకంలో మా స్టార్టప్‌గురించి వ్రాయడం ఎంతో సంతోషంగా ఉంది. అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఈ గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు 25 మంది మా కంపెనీలో పనిచేస్తున్నారు’ 
– హేమంత్‌ సత్యనారాయణ, స్టార్టప్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ 

ఏపీఎల్‌కు కేటరింగ్‌ చేస్తాం.. 
బిలిగ్రే పేరిట హోటల్స్‌ను 2000లో ప్రారంభించాం. వీటి ద్వారా ఐపీఎల్‌ పోటీలకు కేటరింగ్‌ చేస్తుంటాం. మా వద్ద 150 మంది పనిచేస్తున్నారు. దివ్యాంగుడిని అయినా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసి ఏ ఇబ్బంది లేకుండా కష్టపడుతూ పనిచేస్తున్నాను. 
– కిరణ్, బిలిగ్రే వ్యవస్థాపకుడు 

మరిన్ని వార్తలు