ఖతర్‌లో కష్టాలు

6 Oct, 2018 12:05 IST|Sakshi
నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులు పవన్, శ్రీనివాస్‌ గౌడ్‌

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నవారి పరిస్థితులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. జీతం బాగుందనే ఆశతో ఏజెంట్ల మాటలను నమ్మి వెళ్తే దేశం కాని దేశంలో నరకం అనుభవిస్తున్నారు. కొంత మందికి కనీసం తిండికయ్యే ఖర్చంత కూడా వేతనాలు ఇవ్వకుండా అక్కడి కంపెనీలు మోసం చేస్తున్నాయి. ఇదే పరిస్థితిని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ముగ్గురు బాధితులు ఎదుర్కొన్నారు. ఇందులో ఇద్దరు అప్పుచేసి ఖతర్‌ దేశం నుంచి బయటపడి ఇండియాకు తిరిగి వచ్చారు. ఏ పరిస్థితుల్లో ఖతర్‌‡ వెళ్లాల్సి వచ్చింది... ఏజెంటు ఏ విధంగా మోసం చేశాడు... వారు పడ్డ కష్టాలను వివరించారు.

ఆర్మూర్‌ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్‌ మండలం నూత్‌పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్‌ గౌడ్, మోపాల్‌ మండలం బాడ్సీ గ్రామానికి చెందిన కొట్టాల రవి. వీరు ముగ్గురితో పాటుగా జగిత్యాల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారితో కలిపి మొత్తం తొమ్మిది మంది ఏజెంట్‌ చేతిలో మోసపోయారు. కూతురి పెళ్లి చేసేందుకు డబ్బులు కావాలని ఒకరు... ఇక్కడ ఉద్యోగాలు లేక ఖతర్‌లో ఏ పనైనా పర్వాలేదని మరొకరు... ఇల్లు కట్టుకుందామని ఇంకొకరు... ఇలా ఉన్న ఆస్తులను అమ్మేసి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఖతర్‌ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖత్తార్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా వెళ్తున్న వీరికి వేతనం అధిక మొత్తంలో ఉంటుందని, అక్కడి డ్రైవింగ్‌ లైసెన్సు కూడా కంపెనీయే భరిస్తుందని ఏజెంట్‌ చెప్పిన మాయ మాటలకు మోసపోయి ఒక్కొక్కరు రూ.1లక్షా 30వేలు కట్టారు.

మెట్‌పల్లికి చెందిన పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌ అనే ఏజెంటుతో పాటు ముంబాయికి చెందిన మరో ఏజెంటుకు ఈ డబ్బులను మొత్తం చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో ఖతర్‌ దేశం వెళ్లారు. ఆలిజర హోలోడింగ్‌ లిమోసిన్‌ కర్వ టాక్సీ కంపెనీలో డ్రైవర్‌గా చేరారు. ఏజెంటు చెప్పిన విధంగా ఖత్తార్‌లో పని చేసే కంపెనీలో ఒకరోజు ట్యాక్సీ నడిపి 100 రియళ్లు సంపాదిస్తే 30 రియళ్లు వేతనంగా ఇవ్వాలి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. రోజుకు 450 రియళ్లు సంపాదించి ఇస్తేనే 30 శాతం వేతనంగా ఇస్తామని కంపెనీ వాళ్లు టార్గెట్‌ పెట్టడంతో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితికి చేరుకున్నారు. టార్గెట్‌ చేయలేని పక్షంలో ప్రతినెల 500 రియళ్లు (ఇక్కడి వేతనం రూ.8 వేలు) ఇస్తున్నారని, అప్పు చేసి ఇంత దూరం వస్తే ఇలా జరిగిందేంటని ఆందోళనకు గురయ్యారు.
  
ఆదుకుని అన్నం పెట్టిన పాకిస్తానోళ్లు... 
ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోగా, వచ్చే వేతనం భోజనానికి కూడా సరిపోని పరిస్థితి. డ్రైవింగ్‌ లైసెన్సుకు కూడా అప్పు చేసి దాదాపు రూ.1లక్ష వరకు వెచ్చిస్తే తమ పరిస్థితి ఇలా అయిందని కంపెనీ వారితో గొడవ పడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తిండికి డబ్బులు లేక ఒక్కో రోజు పస్తులు ఉండాల్సి వచ్చిందని, గొడవ పడినందుకు కంపెనీ వాళ్లు వేరే చోటికి పంపించారని తెలిపారు. అక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్లున్నా పట్టించుకోలేదని, పాకిస్తాన్‌ దేశస్తులు కొందరు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి కొన్ని రోజుల పాటు ఆదుకున్నారని చెప్పారు. ఇలా కెన్యా, బంగ్లాదేశ్‌ వారు కూడా ఆదుకున్నారన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్‌ మండలం నూత్‌పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్‌ గౌడ్‌లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి డబ్బులు తెప్పించుకుని ఖతర్‌ నుంచి ఆగస్టు నెలలో స్వదేశానికి చేరుకున్నారు. మిగతా కరీంనగర్, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులు డబ్బులు లేక అక్కడే చిక్కుకుపోయారు.

ప్రజాప్రతినిధులకు ట్వీట్‌ చేసినా స్పందించలేదు..
ఏజెంటు చేతిలో మోస పోయి ఖత్తార్‌లో అష్టకష్టాలు పడ్డ ఈ ఇద్దరు నిజామాబాద్‌ వాసులు రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం అక్కడి నుంచే ప్రయత్నాలు చేశారు. వచ్చే వేతనం తిండికి కూడా సరిపోవడం లేదని, తమను ఇండియాకు రప్పించి మోసం చేసిన ఏజెంటుపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకు మెసేజ్‌ పెట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదన్నారు.

పరాయి దేశం పంపుతానని పరారయ్యాడు!

–గల్ఫ్‌ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుల వేడుకోలు 
డిచ్‌పల్లి: విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు, పాస్‌పోర్టు తీసుకొని పరారైన కరీంనగర్‌ జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన గల్ఫ్‌ ఏజెంట్‌ నాడెం నర్సయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన బాధితులు పందెన శ్రీనివాస్, బాలయ్య, పందెన చిన్న గంగాధర్‌ శుక్రవారం ఎస్‌ఐ రాజశేఖర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

బాధితులు మాట్లాడుతూ గల్ఫ్‌ దేశం ఇరాక్‌కు పంపిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరికి రూ.లక్షా 50వేలు ఖర్చు అవుతుందని అడ్వాన్సుగా రూ.65వేల చొప్పున తీసుకుని పరారయ్యాడన్నారు. నెల రోజులుగా వీసా వస్తుందని మాయ మాటలు చెబుతూ వచ్చాడని వాపోయారు. చివరకు గట్టిగా నిలదీసి తమ డబ్బులు, పాసుపోర్టు ఇవ్వాలని అడిగితే పరారయ్యాడని తెలిపారు. తామే కాకుండా ధర్పల్లి మండలానికి చెందిన మరికొందరిని కూడా మోసగించినట్లు తెలిపారు. సదరు ఏజెంట్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. 

 ఫిర్యాదు ప్రతులను చూపుతున్న బాధితులు కుటుంబాల పరిస్థితి తలచుకుంటే
భయంగా ఉంది : బాధితులు 

చేసిన వ్యాపారాలు కలిసి రాకపోవడంతో వేరే మార్గం లేక ఖతర్‌ దేశానికి వెళ్లినం. దేశం వెళ్తే అయినా తమ కుటుంబాలు బాగుపడుతాయని బంగారాం, భూములు అమ్మేసి ఏ జెంటుకు కట్టినం. ఖతర్‌లో ఇచ్చే జీతం తినే తిండికి కూడా సరిపోలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే దేశస్తులు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చిండ్రు. అప్పు చేసి ఇంటికి వచ్చినం. ఇప్పుడు కుటుంబాల పరిస్థితి చూస్తే భయం గా ఉంది. గల్ఫ్‌ ఏజెంటుపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. 

మరిన్ని వార్తలు