చివరిచూపు కోసం.. 

8 Mar, 2019 16:29 IST|Sakshi
గురుకుంటలో ఎదరుచూస్తున్న ప్రీతిరెడ్డి తాత, బంధువులు   

సాక్షి, నవాబుపేట (జడ్చర్ల) : ఆస్ట్రేలియాలో హత్యకు గురైన డాక్టర్‌ ప్రీతిరెడ్డి చివరి చూపైన మాకు దక్కెనా అంటూ మండలంలోని గురుకుంట గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగిన దురాఘతానికి తమ పల్లె యువ డాక్టరమ్మ హత్యకు గురవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. కాగా ప్రీతిరెడ్డి హత్య విషయంలో అక్కడికి వెళ్లేందుకు రెండు రోజులుగా ప్రయత్నించిన బంధువులు ఎట్టకేలకు గురువారం బయలుదేరి వెళ్లారు. గ్రామానికి నర్సింహరెడ్డి గత 36 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే íస్థిరపడ్డారు. వీరికి ఆస్ట్రేలియాలో గ్రీన్‌ కార్డు ఉంది. ఆయన కూతురు ప్రీతిరెడ్డి అక్కడే డాక్టర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో తనతోపాటు డాక్టర్‌ వృత్తిలో ఉన్న వ్యక్తి (మాజీ ప్రీయుడి) చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో ప్రీతిరెడ్డి బాబాయిలు హైదరాబాద్‌కు చెందిన దామోదర్‌రెడ్డి, అమెరికాలో స్థిరపడిన హరికృష్ణరెడ్డి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తారా.. అక్కడే ఖననం చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ప్రీతిరెడ్డి గురుకుంట గ్రామానికి ఒకేసారి వచ్చిందని, స్వగ్రామంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బుధవారం ఆమె మృతికి అక్కడి వైద్య బృందం ఆస్పత్రిలో శ్రద్ధాంజలి ఘటించారు.  

మరిన్ని వార్తలు