‘స్కోచ్‌’ అవార్డుకు గురుకుల సొసైటీలు

30 May, 2018 02:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీలు ప్రతిష్టాత్మక స్కోచ్‌ మెరిట్‌ అవార్డ్‌కు ఎంపికయ్యాయని గిరిజన సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. సమ్మర్‌ సమురాయ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా గురుకులాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావటం వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నారు. ఈ అవార్డు రావటం ఆనందంగా ఉందని, ఇందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్‌ భాగస్వాములే కారణమని ఆయన పేర్కొన్నారు.

‘ఫారెస్ట్‌ పోస్టు’లకు 31నుంచి టెస్టులు
సాక్షి, హైదరాబాద్‌: అటవీ శాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పీఈటీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురువారం నుంచి జూన్‌ 4వరకు మెడికల్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉదయం 9 గంటలకు పరీక్షలు ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు హాల్‌టికెట్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఏదైనా గుర్తింపు కార్డు కచ్చితంగా తమ వెంట తెచ్చుకోవాల్సిందిగా సూచించింది. వివరాలకు ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి. జీn వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.

ఓయూలో విదేశీవిద్యార్థులకు ప్రవేశాలు
హైదరాబాద్‌: 2018–19 విద్యా సంవత్సరానికిగాను ఉస్మానియా వర్సిటీ, అనుబంధ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఓయూ ఫారిన్‌ రిలేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఈ ప్రవేశాలకు విదేశీయులతో పాటు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు అర్హులని వెల్లడించారు. ప్రతి కోర్సులో 10 నుంచి 15 శాతం సీట్లను వీరికోసం కేటాయించామన్నారు. వచ్చేనెల 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

‘వెరిఫికేషన్‌కు 15 వేల మంది హాజరు’
సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా మొదటి రెండు రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 15,557 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. మొదటి ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు 5,905 మంది, 10,001వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకు వరకు 9,652 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.

మొత్తంగా 1,540 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని వెల్లడించారు. ఈనెల 30 న 25,001వ ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమయం వారీగా వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన వారి వివరాలను తమ వెబ్‌సైట్లో పొందవచ్చని సూచించారు.

‘స్త్రీ–శిశు సంక్షేమ’ రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
సాక్షి, హైదరాబాద్‌: స్త్రీ–శిశు సంక్షేమ శాఖలో చైల్డ్‌ డెవలప్‌మెంట్, అడిషనల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్ల పోస్టులకు గురువారం రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో వెరిఫికేషన్‌ జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ మంగళవారం తెలిపింది. మరిన్ని వివరాలు ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో చూడొచ్చని సూచించింది.

మరిన్ని వార్తలు